తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనం వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఇవాళ తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం టీటీడీ మూడు కేంద్రాల్లో సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తుండగా.. భక్తుల తాకిడి పెరుగడంతో ఆయా కేంద్రాల్లో రెండు రోజుల పాటు టోకెన్ల జారీని నిలిపివేసింది.
రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం వేయిటింగ్ సమయం పెరుగుతుండడంతో టోకెన్ల జారీని తాత్కాలికంగా టీటీడీ నిలిపివేసింది. ఆది, సోమవారాలకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయగా.. మళ్లీ మంగళవారం మధ్యాహ్నం నుంచి భక్తులకు తిరిగి టోకెన్లు జారీ చేయనున్నది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని, ఇందుకు అనుగుణంగా తిరుమల యాత్రకు ప్రణాళిక చేసుకోవాలని సూచించింది.