TTD | తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల చేయనున్నది. ఆగస్ట్ 1న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నది. 600 శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. టికెట్కు రూ.2,500 చెల్లించి బుక్ చేసుకోవచ్చని చెప్పింది. మూడు రోజుల పాటు స్నపన తిరుమంజనం, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆగస్ట్ 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.
ఆగస్ట్ 7న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటితో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.