హైదరాబాద్: ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేయనున్నట్టు తెలిపింది. బుధవారం ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. అయితే ఈసారి శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ పెంచింది. ఈ నెల 24 నుంచి అదనపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్టు తెలిపింది. మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 25 వేలకు పెంచింది.
దీంతో మార్చి నెల సర్వదర్శన టికెట్లను రోజుకు 20 వేలకు పెంచిన టీటీడీ, నిత్యం 5 వేల చొప్పున అదనపు కోటా కింద జారీ చేయనున్నది. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లను జారీచేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.