హైదరాబాద్: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. అంగప్రదక్షిణ టోకెన్లను బుధవారం (15వ తేదీ) నుంచి ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. ఈనెల 15 నుంచి జూలై 31 వరకు రోజుకు 750 టోకెన్ల చొప్పున ఆన్లైన్లో జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ టోకెన్లు తీసుకోవాలనుకునేవారు https // tirupathibalaji.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ రద్దు
పౌర్ణమి సందర్భంగా నేడు శ్రీవారి గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ఆలయంలో గరుడసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ప్రస్తుతం స్వామివారి వార్షిక జ్యేష్ఠాభిషేకం ముగింపు వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.