తిరుపతి: శ్రీవారి ప్రసాదాల తయారీ కోసం ఒక కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేనందువల్ల కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు సిద్ధం చేసిన జీడిపప్పు ను స్వయంగా పరిశీలించారు.
మూడు కంపెనీలు జీడిపప్పు సరఫరా చేస్తుండగా ఒక కంపెనీ సరఫరా చేసిన జీడిపప్పు లో దుమ్ము, విరిగిపోయినవీ ఎక్కువ శాతం ఉన్నట్లు గుర్తించారు. టీటీడీ షరతు కంటే ఎక్కువగానే దుమ్ము, విరిగిన జీడిపప్పు ఉన్నాయని అధికారులు చైర్మన్ కు వివరించారు. మిగిలిన రెండు కంపెనీలు సరఫరా చేసిన జీడిపప్పు టెండర్ నిబంధన మేరకు నాణ్యతగా ఉన్నట్లు గుర్తించారు. నాణ్యత సరిగాలేని జీడిపప్పు సరఫరా చేసిన సంస్థ కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అనంతరం యాలకులు, ప్రసాదాల తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యి నాణ్యతతో లేదని అసహనం వ్యక్తం చేశారు. సరుకులు టీటీడీ ల్యాబ్ లో పరీక్షించడంతో పాటు, సెంట్రల్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్ కు కూడా పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు.