హైదరాబాద్ : భువనేశ్వర్లో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 21వ తేదీ నుంచి మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా వేడుకలకు హాజరు కావాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను టీటీడీ చైర్మన్ ఈవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భువనేశ్వర్లో సీఎంను కలిసి ఆహ్వానపత్రికతో పాటు శ్రీవారి ప్రసాదాలు అందించి, శాలువాతో సత్కరించారు. వేడుకల్లో భాగంగా 26న విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
వేడుకలకు హాజరుకానున్నట్లు సీఎం తెలిపారు. అంతకు ముందు సుబ్బారెడ్డి భువనేశ్వర్లో ఆలయ నిర్మాణ పనులు, మహా సంప్రోక్షణ ఏర్పాట్లను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. కళ్యాణమండపంలోని గదులకు ఏసీ సదుపాయం కల్పించాలని భక్తులు చైర్మన్ను కోరారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిశోర్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, వీజీవో మనోహర్, భువనేశ్వర్ స్థానిక సలహామండలి చైర్మన్ దుశ్యంత్ కుమార్, సభ్యులు పాల్గొన్నారు.