తిరుమల : ఈ నెల 13, 14, 15 తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుపతి నగరంలో 14న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగనున్నది. ఈ క్రమంలో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో 12వ తేదీ నుంచి 14 వరకు బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. అలాగే 13, 14, 15వ తేదీల్లో దాతలకు ఎలాంటి గదుల కేటాయింపు ఉండదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా.. తిరుపతిలో 14న సదరన్ రీజియన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన జరుగనున్నది. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు.