Yadadri Temple | కొత్తరూపు సంతరించుకున్న యాదాద్రి భక్తుల రాకకు సిద్ధమైంది. అద్భుత శిల్పసంపదతో అలరారుతున్న లక్ష్మీనరసింహుడి సన్నిధానం చుట్టూ మరెన్నో సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. పర్యాటక గ్రామంగా ఘనత వహించిన చేనేత పట్టుగొమ్మ పోచంపల్లి, దేశదేశాల పర్వాతారోహకులను ఆకర్షిస్తున్న భువనగిరి కోట.. ఇలా ఎన్నో పర్యాటక కేంద్రాలు యాదాద్రి యాత్రికులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆ విశేషాల సమాహారం..
హైదరాబాద్ నుంచి యాదాద్రికి వెళ్లే మార్గంలో ఉంటుంది భువనగిరి కోట. యాదాద్రి కథ మొదలైంది కూడా ఈ కొండ మీదే! భువనగిరి రాజధానిగా త్రిభువనమల్ల
విక్రమాదిత్యుడు ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయన హయాంలోనే యాదాద్రి ఆలయాన్ని మొదటిసారి నిర్మించారు. భువనగిరి శివారులోకి చేరుకోగానే భారీ కొండ అందంగా
కనిపిస్తుంది. ఆ కొండపైనే అందమైన దుర్గం ఉంది. బలమైన రాతి ప్రాకారాలతో రాజప్రాసాదం దర్శనమిస్తుంది. శిథిలావస్థకు చేరుకున్న కోట ఆనాటి రాజుల కళాదృష్టిని
కళ్లకు కడుతుంది. సభా మందిరం, నివాస గృహాల గోడల మీద కమానుల ఆకారంలో నిర్మించిన చిన్నచిన్న గూళ్లు, శిల్పాలు, నేటికీ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
కొండమీదికి మెట్ల మార్గంలో వెళ్లొచ్చు. మార్గంలో ఆయుధాగారాలు, గుర్రాలు-ఏనుగుల శాలలు కనిపిస్తాయి. రాతికొండమీద మంచినీటి కోసం తవ్వించిన ఏడు కోనేర్లు ఉన్నాయి. భువనగిరి కోట నుంచి గోల్కొండ వరకు సొరంగ మార్గం ఉందని స్థానికులు చెబుతుంటారు. చారిత్రక భువనగిరి దుర్గాన్ని 12వ శతాబ్దంలో కల్యాణ చాళుక్యరాజు ఆరో త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు నిర్మించినట్లు శాసనాలు ఉన్నాయి. మొదట్లో దీనిని ‘త్రిభువనగిరి’ అని పిలిచేవారు. కాలక్రమంలో భువనగిరిగా స్థిరపడింది. 610 మీటర్ల ఎత్తు ఉండే భువనగిరి కొండను ట్రెక్కింగ్ స్వర్గధామంగా అభివర్ణిస్తారు. దేశదేశాలకు చెందిన పర్వతారోహకులు ట్రెక్కింగ్ విన్యాసాల కోసం ఇక్కడికి వస్తుంటారు. నిండు వానాకాలంలో కొండంతా జలపాతమై సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఆ నయన మనోహర దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తే గానీ మనసుకు తృప్తి కలగదు.
ప్రతిష్ఠాత్మక మేడారం సమ్కక్క, సారలమ్మ జాతర తరహాలోనే యాదాద్రి సమీపంలోని కుర్రారంలో ‘మినీ మేడారం’ నిర్వహిస్తారు. రాజపేట మండలం బూర్గుపల్లి, కుర్రారం గ్రామాల మధ్యన ఉన్న అభయారణ్యం మినీ మేడారం జాతరకు వేదిక. మేడారం వెళ్లలేని భక్తులు ఈ వనానికి వచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని తరిస్తారు. మేడారం జాతర
మొదలైన నాడే ఇక్కడా ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. జాతర జరిగే మూడు రోజుల్లో పదిలక్షల మంది భక్తులు గిరిజన దైవాలను సందర్శించుకుంటారు. బూర్గుపల్లి గ్రామానికి చెందిన చింతల అంజయ్య, ఐలమ్మ దంపతులకు సంతానం లేదు. మేడారం సమక్మ, సారమ్మలను దర్శించుకోగా సంతానం కలిగింది. కోరిక తీరడంతో ఆ దంపతులు 1994లో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క, సారలమ్మలను మేడారం ప్రధాన పూజారి చేతుల మీదుగా అభయారణ్యంలో ప్రతిష్ఠింపజేశారు. తర్వాత రెండేళ్ల నుంచి ఇక్కడ జాతర
నిర్వహిస్తున్నారు.
ఇలా చేరుకోవాలి: యాదాద్రి నుంచి 23 కి.మీ. దూరంలో కుర్రారం ఉంటుంది. ప్రైవేటు వాహనాల్లోనూ వెళ్లొచ్చు.
‘సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా’గా పేరున్న పోచంపల్లి నూలు, పట్టు వస్ర్తాలకు ప్రసిద్ధి. ఇటీవల పర్యాటక గ్రామంగా గుర్తింపు పొందిన పోచంపల్లిలో ఇంటాబయటా ముగ్గులు, ఇంటిలో మగ్గాలు కనిపిస్తాయి. పరిసర గ్రామాల్లో వేలమంది చేనేత ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ నేసిన దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆచార్య వినోబా భావే ‘భూదాన’ ఉద్యమ కార్యక్షేత్రంగా పోచంపల్లి చరిత్రలో నిలిచిపోయింది. గ్రామంలో పెద్దాచిన్నా, ఆడామగా అందరూ నేతవృత్తిలో తమ పాటవాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వారు నేసే దుస్తులు, పనిచేసే విధానం పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించడంతో వివిధ దేశాలకు చెందిన అధికారుల బృందాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పోచంపల్లిని సందర్శిస్తుంటారు. గ్రామీణ ప్రాంత నేపథ్యంలో ఆహ్లాదకరమైన గుట్టలు, లోయలు, పచ్చని చెట్లు, పొలాలు, చెరువులు పోచంపల్లిని సినిమా షూటింగ్లకు వేదికగా మార్చాయి.
ఇలా చేరుకోవాలి: యాదాద్రి నుంచి ముందుగా బీబీనగర్ (35 కి.మీ.) చేరుకోవాలి. అక్కడి నుంచి 16 కి.మీ. ప్రయాణిస్తే పోచంపల్లి చేరుకోవచ్చు. బస్సు సౌకర్యం ఉంది.
వలిగొండ మండలం వెంకటాపురంలో ఉంటుంది మత్స్యగిరి ఆలయం. కృతయుగంలో కొంతమంది రుషులు తపస్సు చేసుకునేందుకు ఈ కొండమీదికి వచ్చారట. వారి తపస్సుకు
దుష్టశక్తులు విఘాతం కలిగించాయట. ఆ దుష్టశక్తులను తరమడానికి నరసింహస్వామి ఆవిర్భవించాడు. స్వామి చేసిన భీకర శబ్దాలకు మత్స్యగిరి మూడు ముఖాలుగా, మూడు గుండాలుగా మారిపోయింది. దుష్టశక్తులు పలాయనం చిత్తగించాయి. తర్వాత నరసింహస్వామి సాలగ్రామ రూపంలో మత్స్యగిరిపై కొలువుదీరాడు. స్వామి పాదాల నుంచి ప్రవహించిన జలం ఆ గుండాలలో చేరింది. కొండ మీద ఉన్న గుండంలో తలమీద నామాలు ఉన్న చేపలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇలా చేరుకోవాలి: యాదాద్రి నుంచి భువనగిరి మీదుగా వలిగొండకు (36 కి.మీ.) చేరుకోవాలి. అక్కడినుంచి వెంకటాపురం 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆటోలో మత్స్యగిరికి చేరుకోవచ్చు.
…? గంజి ప్రదీప్ కుమార్