శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. మంగళవారం ఉదయం కుమారస్వామికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా త్రయోదశి పురస్కరించుకొని పరోక్షసేవలో భాగంగా ప్రధాన ఆలయంలో నందిమండపంలో కొలువైన నందీశ్వరునికి సంధ్యాసమయంలో ఈవో పంచామృతాభిషేకాలు, శుద్దోదకం, ఫలోదకాలతో అభిషేకించి షోడశోపచార పూజలు నిర్వహించారు.
అనంతరం నందీశ్వరునికి శెనగలు నైవేద్యంగా సమర్పించి వర్షాలు సకాలంలో కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం ప్రదోషకాలంలో క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి పంచామృతాభిషేకాలు, పుష్పార్చనలు జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కళారాధనలో భాగంగా కళాకారులచే సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి.