TTD | తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలను మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.30 గంటలకు మూసివేయగా.. రాత్రి 7.30 గంటలకు వరకు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ ద్వారా మూసి ఉంచనున్నారు. అంతకు ముందు వేకువ జామున శ్రీవారి ఆలయ ద్వారాలను తెరిచి నిత్యకైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చంద్రగ్రహణం కారణంగా టీటీడీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను సైతం నిలిపివేసింది. మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగనున్నది. గ్రహణం అనంతరం రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసిన అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. గ్రహణం కారణంగా పౌర్ణమి సందర్భంగా ఇవాళ నిర్వహించాల్సిన పున్నమి గరుడ సేవను సైతం టీటీడీ రద్దు చేసింది.
గ్రహణం కారణంగా శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయాలను సైతం అధికారులు మూసివేశారు. సాయంత్రం 6.30 గంటల అనంతరం సంప్రోక్షణ పూజలు నిర్వహించి, తలుపులను తిరిగి తెరువనున్నారు. రాత్రి 8 గంటల నుంచి మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల అలంకార దర్శనాలను కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.