Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం సాలకట్ల ఆణివార ఆస్థానం వైభవంగా జరిగింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారువాకిలి ఎదుటనున్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో మలయప్పస్వామివారిని గరుత్మంతునికి అభిముఖంగా, మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడిని దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు, బంగారువాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం పెద్దజీయర్స్వామి వెండితట్టలో ఆరు పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు.
చినజీయర్స్వామి, ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు. తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో ‘పరివట్టం’ కట్టుకొని.. స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తర్వాత అర్చకులు పెద్దజీయంగార్, చిన్న జీయంగార్, టీటీడీ ఏఈ ఏవీ ధర్మారెడ్డికి ‘లచ్చన’ అనే తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదల అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆణివార ఆస్థానం ముగిసింది.
ఉత్సవం అనంతరం ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయణ పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి రోజున ఉత్సవాన్ని నిర్వహిస్తారని చెప్పారు. అయితే, సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం.. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చిందన్నారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజైన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుంచి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవని తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటైన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చినట్టు వివరించారు.
ఆణివార ఆస్థానం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం రంగనాథస్వామివారి ఆలయ అధికారులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం ఉదయం బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనున్న పెద్ద జీయర్స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, చిన్న జీయర్స్వామి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి కలిసి పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.