ఓ రంజాన్ వసంతమా కాస్తంత నిదానంగా కదులు! ఇంకా ఎన్నెన్నో మంచి పనులు చేయాలి. అల్లాహ్ మెప్పు పొందాలి. నా పాపాలకు పశ్చాత్తాపం చెందాలి. జన్నత్ కోసం సంసిద్ధులవ్వాలి. ఓ రంజాన్ కాస్తంత నిదానంగా కదులు. రంజాన్ వసంతం చివరి దశకు చేరుకుంది. రంజాన్ నెల ఎడబాటును తలుచుకుంటూ ‘అల్విదా మాహె రంజాన్’ అంటూ వీడ్కోలు గీతాలు పాడుకుంటున్నారు. రంజాన్ మాసంలోని ప్రతి ఘడియనూ సద్వినియోగం చేసుకునేందుకు, అల్లాహ్ మెప్పు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు. వచ్చే రంజాన్ వరకూ మమ్మల్ని క్షేమంగా ఉంచమని అల్లాహ్ను వేడుకుంటారు.
ఈదుల్ ఫిత్ పర్వదినానికి ముందురోజు రాత్రి సప్త ఆకాశాల పైనుంచి భూమండలానికి దైవదూతలు దిగివస్తారు. ఈ రాత్రిని లైలతుల్ జాయిజా అంటారు. నెల రోజులు పాటించిన రోజా, నమాజులు, దానధ ర్మాలకు గాను దైవదూతలు ప్రతిఫలమిచ్చే రోజు ఇది. ఒక్కో సత్కార్యానికి ఏడు రెట్ల పుణ్యఫలాన్ని లెక్కించి కర్మ పత్రంలో లిఖిస్తారు. ‘నా దాసులు రోజంతా ఆకలి దప్పులతో గడిపారు, రాత్రుళ్లు నిద్రను త్యాగం చేసి నమాజులో నిల్చున్నారు. ఇలాంటి దాసులకు నేను ముక్తిని ప్రసాదిస్తున్నాను’ అని అల్లాహ్ ప్రకటిస్తాడు. ఈ సంతోషంతోనే ముస్లిమ్లంతా కలిసి ఈద్ రోజు ఈద్గాలో ‘షుక్రానా’ నమాజు చేస్తారు.
పండుగ సంతోషాలను చుట్టుపక్కల నిరుపేదలతోనూ పంచుకోవాలని అల్లాహ్ సూచన. అందుకే పండుగ నమాజ్ కంటే ముందే పేదలు, అభాగ్యులు, వితంతువులకూ ఫిత్రా దానం చేస్తారు. పండుగ సంతోషాల్లో వాళ్లనూ భాగం చేస్తారు. ఫిత్రాలు పంచుతారు కాబట్టే ఈదుల్ ఫిత్ అంటారు. ఇది పేదసాదల పండుగ. ఒక్కో కుటుంబసభ్యుడికి గానూ రూ.80 నుంచి రూ.100 చొప్పున లెక్కగట్టి పేదలకు అందిస్తారు. ఆహార పదార్థాలు, దుస్తులు, నగదు ఇలా రకరకాల రూపాల్లో ఫిత్రా చెల్లించవచ్చు. పండుగ రోజు ఏ ఒక్కరూ చేయిచాచి అడగరాదన్నదే ఫిత్రా దానాల పరమార్థం అని ముహమ్మద్ ప్రవక్త (స) సందేశం.
రంజాన్ నెల రోజా రోజులు నిగ్రహాన్ని నేర్పుతాయి. పరోపకారాన్ని బోధిస్తాయి. సానుభూతిని తెలియజేస్తాయి. దేవుడు చూస్తున్నాడన్న తలంపును తట్టిలేపుతాయి కాబట్టే పద్నాలుగు గంటలపాటు అన్నపానీయాలకు దూరంగా ఉంటారు. ముహమ్మద్ ప్రవక్త ద్వారా అల్లాహ్ తరఫున ఖురాన్ గ్రంథం లభించినందుకు కృతజ్ఞతగా ముస్లింలు నెల రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఖురాన్ అంటే మాటిమాటికీ చదివే గ్రంథమని నిఘంటు అర్థం. ఖురాన్ అంటే అనుసరించడం అనే అర్థమూ ఉంది. జీవన గ్రంథమైన ఖురాన్కు అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకే నెలరోజులపాటు ఉపవాసాలు నిర్ణయించాడు దైవం. ఖురాన్ శాంతిని బోధిస్తుంది. బీదసాదలపట్ల సానుభూతి చూపాలంటుంది. కోపం, మదం, మోహం, అవినీతి, అహంకారం, దౌర్జన్యం వంటి దుర్గుణాలను త్యజించాలని బోధిస్తుంది. ధరణిపై కల్లోలాన్ని అస్సలు సహించదు. అశాంతిని ఊరుకోదు. ఖురాన్ మంచిని ప్రేమించాలనే సందేశమిస్తుంది. తల్లిదండ్రుల సేవ చేసి స్వర్గానికి బాటలు పరుచుకోవాలని తాకీదు చేస్తుంది. బంధువుల అనాథల హక్కులు నెరవేర్చాలని హెచ్చరిస్తుంది. సుఖమయ దాంపత్యానికి చిట్కాలు చెబుతుంది. ఇలా జీవితంలోని అన్ని రంగాలకు ఖురాన్ దారి చూపుతుంది. జీవితాన్ని సాఫల్యం చేస్తుంది. ఖురాన్ గాథలు, సందేశాలు మనిషిని సంస్కరిస్తాయి.
పండుగ పూట తెల్లవారుజామునే లేవడం ప్రవక్త సంప్రదాయం. మిస్వాక్ పుల్లతో దంతధావనం చేయాలి, తలంటు స్నానం (గుసుల్ స్నానం) చేయాలి. అత్తరు పరిమళాలు పూసుకోవాలి. ఈద్ నమాజుకు ముందు తియ్యని పదార్థాన్ని సేవించాలి. లేదంటే బేసి సంఖ్యలో ఖర్జూరాలు తినవచ్చు. ఈద్ నమాజుకంటే ముందే ఫిత్రా దానం చేయాలి. ముహమ్మద్ ప్రవక్త కాలంలో ఆయన సహచరులు పావు తక్కువ రెండు కిలోల గోధుమలు, ఇంకొంతమంది మూడున్నర కిలోల ఖర్జూరాలు, మరికొంతమంది మూడున్నర కిలోల కిస్మిస్ను ఫిత్రా దానంగా ఇచ్చేవారట. ఈ కాలంలో వాటికి సరిపడా విలువను లెక్కించి డబ్బును దానం చేయాలని ఉలేమాలు చెబుతారు. ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వారు దానం చేస్తారు. స్థితిమంతులు గోధుమలను కాకుండా ఖర్జూరాలను గానీ, కిస్మిస్ను గానీ ప్రామాణికంగా తీసుకొని వాటి విలువను లెక్కించి పేదలకు పంచాలని ఉలేమాలు చెబుతారు. ఫిత్రా దానం చెల్లించడం ప్రతీ ముస్లిం విధి. అప్పుడే పుట్టిన శిశువుకు కూడా ఫిత్రాను లెక్కగట్టి చెల్లించాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరున ఈ దానం చేయాలి. లేదంటే పండుగ నమాజు అల్లాహ్ స్వీకృతి పొందదు. పిల్లలకు, బంధుమిత్రులకు కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి.
…?ముహమ్మద్ ముజాహిద్ 9640622076