యేప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః
తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకమ్
(భగవద్గీత 9-23)
‘ఓ అర్జునా! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ, వారు నన్ను పూజించినట్లే’ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవుడు ఒక్కడే అన్న భావనను తెలియజేస్తుంది ఈ శ్లోకం. అంతటా వ్యాపించి ఉన్న భగవంతుడు ఒక్కడే అయినా, దేశకాల పరిస్థితులు, నమ్మకాలు, వ్యక్తిగత ఇష్టాలను బట్టి వేర్వేరు రూపాలతో కొలుస్తుంటారు. సాధారణ మనుషుల రూపాలు, పేర్లతోపాటు వారి అభిరుచులు, అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. అలాగే దైవాన్ని వివిధ రూపాలుగా కొలిచి, వివిధ నామాలతో, రకరకాల పద్ధతులలో ఉపాసిస్తూ ఉంటారు. కొందరు శక్తిగా భావిస్తారు. మరికొందరు రాముడిగా కీర్తిస్తారు. ఇంకొందరు శివుడిగా భావించి స్తుతిస్తారు. ఎవరు ఎలా ఆరాధించినా, ఏవిధంగా ఉపాసించినా దైవం కరుణిస్తాడు.
భక్తుడు ఏ రూపంలో పూజిస్తే.. అదే రూపంలో అనుగ్రహిస్తాడు భగవానుడు. ఏ దేవుడి కోసం చేసిన ఆరాధనలైనా అవన్నీ అనంతమైన పరమాత్ముడికే చెందుతాయని తెలుసుకోవాలి. ఒకే దైవంలో అనంత రూపాలు దర్శించవచ్చు. శ్రీకృష్ణుడిని గోపికలు ప్రియునిగా ఆరాధించేవారు. గోపబాలురు స్నేహితుడిగా భావించారు. యశోదా నందులు, దేవకీ వసుదేవులు కొడుకుగా లాలించారు. శిశుపాలుడు శత్రువుగా తలచాడు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా శ్రీకృష్ణుడిని దర్శించారు. ఎవరు ఎలా పిలిచినా అందరినీ స్వామి అనుగ్రహించాడు. సకామ భక్తితో మనం ఏ దైవాన్ని పూజించినా అది పరమాత్మకు చెందుతుంది. దైవం ఒకటే అన్న భావన లేకుండా చేసే పూజలు అవిధి పూర్వకాలనీ, అజ్ఞానంతో కూడినవని గీతాచార్యుడు తెలియజేశాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని భగవంతుడు ఒక్కడే, భగవన్నామం ఒక్కటే అన్న నిశ్చయానికి రాగలిగితే అదే మోక్షానికి ద్వారం అవుతుంది.
…?విష్ణువర్ధన్