ఓ గ్రామపెద్దకు ఆధ్యాత్మిక విషయాలపై అమితాసక్తి ఉండేది. ప్రతీ శనివారం కృష్ణుడి గుడిలో గ్రామస్తులందరితో గీతా పఠనం చేయించాలని అనుకున్నాడు. వంద భగవద్గీత పుస్తకాలు తెప్పించాడు. విద్యావంతురాలైన ఒక మహిళకు గీతా పఠనం బాధ్యతను అప్పగించాడు. గుడి ఆవరణలో తివాచీలు, కుర్చీలు వేయించాడు. దీపాలు, మైకు లాంటి సదుపాయాలన్నీ కల్పించాడు. ఆమె గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి కార్యక్రమం నిర్వర్తించాలి. కొన్ని వారాలు పనుల ఒత్తిడి కారణంగా గ్రామపెద్ద గుడికి వెళ్లలేకపోయాడు. గీతా పఠనం ఎలా జరుగుతుందో తెలుసుకుందామని ఓ రోజు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆరాతీస్తే.. గ్రామస్తులు అంతగా ఆసక్తి చూపడం లేదని చెప్పిందామె. అక్కడే వరండాలో ఆమె ఏడాది బిడ్డ ఆడుతూ కనిపించింది. పక్కనే ఉన్న తేనె సీసాను ఆ బిడ్డ ముందుంచాడు గ్రామపెద్ద.
ఆ చిన్నారి సీసాను పక్కకు తోసింది. ఈసారి సీసాలోని తేనె కొంచెం తీసి బిడ్డకు రుచి చూపించాడు. తేనె తియ్యదనానికి బిడ్డ ఆనందించింది. సీసా అందుకునే ప్రయత్నం చేసింది. చిన్నారికి సీసా కనిపించకుండా తలుపు చాటున దాచాడు పెద్ద. అది గమనించిన బుజ్జాయి బుడిబుడి అడుగులేస్తూ సీసా వైపునకు వెళ్లింది. అప్పుడా గ్రామపెద్ద ఆ మహిళతో ‘తేనె తీపిదనం తెలియక మీ బిడ్డ.. మొదట్లో తేనె సీసాను పట్టించుకోలేదు. తేనె తీపి తెలుసుకున్నాక దాని కోసం ఆరాటపడటం చూశావు కదా! అదేవిధంగా గీతలోని మాధుర్యం తెలుసుకోలేక గ్రామస్తులు గీతా పఠనంపై ఆసక్తి చూపడం లేదు. గీతా మకరందాన్ని వారికి పరిచయం చేయగలిగితే.. కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు’ అని సూచించాడు. గ్రామపెద్ద చెప్పినట్టే మహిళ వ్యవహరించడంతో గుడి ప్రాంగణం గీతా పఠనం చేసేవారితో కళకళలాడింది.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు 93936 62821