ప్రవక్త ఇబ్రాహీం సరిగ్గా ఐదువేల ఏండ్ల కిందటివారు. ఆయన సృష్టిని పరిశీలన దృష్టితో చూసేవారు. ఇంతపెద్ద సృష్టికి ఒక కర్త ఉండి ఉంటాడని భావించేవారు. ఒకరోజు రాత్రి ఆకాశంలో నక్షత్రాలను తదేక దృష్టితో గమనించి ‘అవే నా ప్రభువు’ అని ప్రకటించారు. కాసేపటికి నక్షత్రాలు కనుమరుగైపోయాయి. తర్వాత ప్రకాశవంతంగా వెలుగొందుతున్న చంద్రుణ్ని చూసి ‘ఇదే నా ప్రభువు’ అని ప్రకటించారు. కాసేపటికి చంద్రుడూ అస్తమించాడు. కొంత సమయం తర్వాత సూర్యోదయమైంది. సూర్యుడిని చూస్తే ‘ఇది తప్పకుండా నా ప్రభువై ఉంటుంది’ అన్నారు. సాయంత్రానికి సూర్యుడూ అస్తమించాడు. చివరికి ఈ ఖగోళాలన్నీ ఒక విశ్వ ప్రభువు ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నాయని నిర్ధారణకు వచ్చారు. భూమ్యాకాశాల సృష్టికర్త వైపునకు ఆయన మళ్లారు. సృష్టి పూజ మానుకుని, సృష్టికర్తను ఆరాధించాలని సందేశం ఇచ్చారు.
వయసు పైబడుతున్న కొద్దీ తన తదనంతరం దైవ సందేశ కార్యభారాన్ని నిర్వర్తించడానికి సంతానం ఉంటే బాగుండేదని ఇబ్రాహీం భావించారు. దైవం పండంటి బిడ్డను ప్రసాదించాడు. లేకలేక కలిగిన బిడ్డను చూసుకొని ఆ దంపతులు ఎంతగానో మురిసిపోయారు. అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. దేవుడు ఆయనకు మరో పరీక్ష పెట్టాడు. భార్యను, కొడుకును జనసంచారం లేని ఎడారి ప్రాంతంలో వదిలేసిరమ్మని ఆదేశించాడు. ఇబ్రాహీం (అస) తన భార్యకు కొన్ని ఎండుఫలాలు, కొంత నీరు, మరికొన్ని వస్తువులు ఇచ్చి ఎడారిలో వదిలి తీవ్ర విచారంతో వెనుదిరిగారు. కొంతకాలానికి దైవాదేశం మేరకు ఇబ్రాహీం మక్కా తిరిగొచ్చి భార్యా బిడ్డల్ని కలుసుకున్నారు. తనయుడితో కలసి కాబా గృహాన్ని నిర్మించారు. తర్వాత ఆయనకు మరో కఠినమైన పరీక్ష ఎదురైంది. ఈసారి దైవం ఏకంగా కన్నకొడుకునే బలివ్వమని కలలో ఆదేశించాడు.
కొడుకు ఇస్మాయీల్ కూడా తండ్రికి తగ్గ తనయుడే. దేవుడు కలలో చెప్పిన ఆదేశాన్ని అమలు చేయాలని తండ్రిని కోరాడు. ఇస్మాయీల్ దుస్తులు తొలగించి తన గుర్తుగా వాటిని తల్లికి ఇవ్వాలన్నాడు. బలిచ్చేటప్పుడు తన కాళ్లు చేతులు కట్టేయాలన్నాడు. ఇబ్రాహీం (అ) తన కత్తికి పదునుపెట్టారు. కుమారుడిని గట్టిగా కౌగిలించుకుని రోదించారు. కొడుకును పడుకోబెట్టి కాళ్లు చేతులు కట్టేశారు. బరువెక్కిన హృదయంతో కత్తి పైకెత్తి కొడుకు గొంతుకపై వేటువేశారు. కానీ, ఆ కత్తి గొంతును కోయలేదు. కత్తితో గట్టిగా కోయాలని ఇస్మాయీల్ అరుస్తూ చెప్పాడు. ఇబ్రాహీం (అలై) అలాగే చేశారు. అయినా కత్తి గొంతును కోయలేదు. ఇబ్రాహీం ఆశ్చర్యపోయారు. ‘ఇబ్రాహీం నీవు కలను నిజం చేసి చూపించావు. మేము నీ విధేయతకు బహుమానం ప్రసాదిస్తున్నాం’ అన్నాడు అల్లాహ్. దైవానికి కావలసింది బలికాదు. ఆయన నిబద్ధతను మాత్రమే పరీక్షించాలని భావించారు. ఇస్మాయీల్కు బదులుగా బలివ్వడానికి స్వర్గం నుంచి పొట్టేలును పంపించాడు అల్లాహ్. దాన్ని బలిచ్చాడు. ఆ త్యాగానికి ప్రతీకగానే ఏటా ముస్లింలు బక్రీద్ పండుగను మూడు రోజులపాటు జరుపుకొంటారు. నాడు ఆ తండ్రీకొడుకులు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ ఖుర్బానీ ఇస్తుంటారు.
ముహమ్మద్ ముజాహిద్, 96406 22076