Narasimha Swamy Temples in Telangana | ప్రహ్లాదుడి మాట దక్కించడం కోసం స్తంభంలో సాక్షాత్కరించాడు నరసింహస్వామి. అవతార ప్రయోజనం పూర్తయ్యాక.. దండకారణ్యమంతా కలియ తిరిగాడట నరహరి. అలా స్వామి అడుగుపెట్టిన ప్రతి నెలవూ.. పవిత్రమే. స్వామి స్వయంభువుగా వెలిసిన క్షేత్రాలు తెలంగాణలో కోకొల్లలు ఉన్నాయి. కొండల్లో, కోనల్లో కోరమీసాల దేవుడిగా.. పల్లె పొలిమేరల్లో చల్లని చూపుల దైవంగా.. వనాల్లో, పురాల్లో, పట్టణాల్లో.. కొంగు బంగారమై పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయాల్లో దేని ప్రాశస్త్యం దానిదే. ప్రతిదీ ప్రత్యేకమైనదే. వాటిలో ప్రముఖమైన నరసింహ క్షేతాల సింహావలోకనం ఇది..
రుతువులను అనుసరించి ఆరు రంగుల్లోకి మారే పుష్కరిణి. గరుడ ముద్దలతో పిల్లలు లేనివారికి సంతాన ప్రాప్తి. శివకేశవులకు భేదం లేదని చాటుతూ సాగే శివరాత్రి ప్రత్యేక పూజలు. ఈ విశేషాలన్నీ ఒకే ఆలయంలోనివి. అదే.. ఉగ్రనరసింహుడు శాంతమూర్తిగా కొలువైన కాల్వ శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం.
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువయ్యాడు నరసింహుడు. 13వ శతాబ్దంలో కాకతీయ పాలకులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే, అంతకుముందే ఆలయం వెనక భాగంలో కొండపైన స్వామివారు సింహరూపంలో స్వయంభువుగా వెలిశారని స్థల పురాణం చెబుతుంది.
ఎన్నెన్నో ప్రత్యేకతలు: ఎక్కడా లేనివిధంగా శివరాత్రి సందర్భంగా నరసింహస్వామికి పూజలు నిర్వహిస్తారు. శివకేశవులకు అభేదం చాటుతూ ఈ వేడుకలు నిర్వహించడం విశేషం.
గరుడ ముద్దలు: కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మరో విశేషం.. గరుడ ముద్దలు. స్వామివారి కల్యాణోత్సవం రోజున ఆలయం దగ్గర ఈ వేడుక నిర్వహిస్తారు. పిల్లలు లేనివారు ఈ గరుడ ముద్దలను ప్రసాదంగా స్వీకరించి తింటే.. సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఏటా స్వామివారి కల్యాణోత్సవానికి వందల జంటలు హాజరవుతాయి. ప్రహ్లాదుడి లాంటి బిడ్డను ప్రసాదించమని పరమాత్మను వేడుకుంటాయి.
మహిమగల కోనేరు: ఇక్కడి మరో విశిష్టత.. ఆలయానికి ఈశాన్య భాగంలో ఉన్న పుష్కరిణి. ఇందులోని నీళ్లు.. రుతువులను అనుసరించి ఆరు రంగుల్లోకి మారుతాయి. ఈ కోనేరులో స్నానం చేస్తే చర్మరోగాలు రావని విశ్వసిస్తారు. అంతేకాకుండా ఈ కోనేటి నీటిని పంటపొలాల్లో చల్లితే దిగుబడి పెరుగుతుందని రైతుల విశ్వాసం.
ఇలా చేరుకోవచ్చు: నిర్మల్ నుంచి కాల్వ నరసింహస్వామి క్షేత్రం 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నిర్మల్ – భైంసా మార్గంలో సిర్గాపూర్, న్యూ లోలం గ్రామాల మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు.
చుట్టూ దట్టమైన అడవి. పచ్చని కొండల మధ్య వెలిసిన మల్లూరు దేవాలయం.. ప్రకృతి రమణీయతతో యాత్రికులను కట్టిపడేస్తుంది. మల్లూరు హేమాచల నరసింహ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. కొండపై కొలువైన నరసింహ స్వామి మూల విరాట్ ఒంటి నిండా రోమాలతో, సహజ శరీరంతో అలరారుతుంది. 10 అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహాన్ని తాకితే, మానవ శరీరాన్ని తాకిన అనుభూతి కలుగుతుంది. నాభి నుంచి నిరంతరం చందన రూపంలో ద్రవం కారుతూ ఉంటుంది. అర్చకులు ఈ ద్రవాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. స్వామికి నిత్యం తైలాభిషేకం నిర్వహిస్తారు. ఏటా వైశాఖ మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
చింతామణి జలపాతం..
మల్లూరు క్షేత్రంలో మరో విశేషం.. చింతామణి జలపాతం. గర్భగుడిలో స్వామివారి పాదాల నుంచి నిరంతరం నీటి ఊట ఉబుకుతూ ఉంటుంది. దీనికే ‘చింతామణి జలధార’ అని పేరు. ఇది అన్ని కాలాల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. ఈ నీరు కొండ కింద ఉన్న కోనేరులోకి ప్రవహిస్తుంది. ఈ నీటిని సేవిస్తే రోగాలు నయమవుతాయని నమ్ముతారు. ఒకసారి ఓరుగల్లు సామ్రాజ్ఞి రుద్రమదేవి అనారోగ్యానికి గురికాగా, వైద్యుల సూచన మేరకు ఈ జలధార నీటిని తాగితే.. వ్యాధి నయమైందట.
ఇలా చేరుకోవచ్చు
హైదరాబాద్ నుంచి 290 కి.మీ., ములుగు నుంచి 90 కి.మీ. దూరంలో ఉంటుంది మల్లూరు. మంగపేట నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే, మల్లూరు గుట్టల వద్దకు చేరుకోవచ్చు.
ఖమ్మం పట్టణంలోని స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం.. అత్యంత ప్రాచీనమైనది. హిరణ్యకశిపుని సంహరించేందుకు స్వామివారు స్తంభంలోంచి ఆవిర్భవించడం.. ఇక్కడి కొండ స్తంభం ఆకారాన్ని పోలి ఉండటంతో ఈ క్షేత్రానికి ‘స్తంభాద్రి’ అనే పేరు వచ్చింది.
స్తంభాద్రి ఆలయాన్ని 15వ శతాబ్దంలో లకుమారెడ్డి, వేమారెడ్డి అనే సోదరులు నిర్మించారు. కొండను తొలచి, ఆలయంగా మలచిన తీరు అబ్బురపరుస్తుంది. 30 ఆడుగుల ఎత్తుగల ఏకశిలా ధ్వజస్తంభం ఈ ఆలయం ప్రత్యేకత. ఇక్కడి బండరాళ్ల మధ్య కోనేరు ఉంది. స్వామివారి పాదతాడనంతో ఇది ఏర్పడిందట. దీనిలో అన్ని కాలాల్లోనూ నీరు ఉంటుంది. ఆలయంలో స్వయంభువుగా వెలిసిన స్వామివారు దక్షిణాభిముఖంగా ఉండటం విశేషం. ధ్వజస్తంభం కూడా స్వామివారికి అభిముఖంగా కాకుండా, కొంచెం పక్కగా ఉంటుంది. ధ్వజస్తంభం పక్కనే ఆంజనేయ స్వామి మందిరం, గుట్టపై సుబ్రమణ్యస్వామి, విష్ణుమూర్తి, శ్రీవేంకటేశ్వర ఆలయాలు ఉన్నాయి.
స్థల పురాణం
పూర్వం ముద్గల మహర్షి ఈ ప్రాంతంలోనే శ్రీహరి కోసం తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన స్వామివారు లక్ష్మీసమేత నరసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. మహర్షి కోరిక మేరకు స్వామివారు ఇక్కడే గుహలో కొలువు తీరాడని స్థల పురాణం.
పానకంతో అభిషేకం..
ఖమ్మంమెట్టు ఆలయంలో మరో విశేషం.. స్వామివారికి పానకంతో అభిషేకం చేయడం. ఉగ్రరూపుడైన స్వామివారిని శాంతింపజేసేందుకే పానకంతో అభిషేకం చేస్తారు. ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, దసరా ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తారు. విజయదశమి సందర్భంగా నిర్వహించే ‘పారువేట’ ఉత్సవం మరో ప్రత్యేకత. స్వామివారిని నగర నడిబొడ్డున ఉన్న జమ్మిబండ వద్దకు ఊరేగింపుగా తీసుకొస్తారు. ఇక్కడే భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.
పవిత్ర గోదావరి తీరాన నరసింహుడు కొలువైన క్షేత్రం ధర్మపురి. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహిస్తూ పవిత్రతను చాటుతున్నది. ‘కొబ్బరి బెల్లాలివిగో నరసయ్య.. కోటి దండాలయ్యో నరసయ్య.. నీ క్షేత్రానికి వస్తున్నామయ్యో నరసయ్యా!’ అంటూ ప్రతి నిత్యం భక్తకోటి ధర్మపురిని సందర్శిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువైన ‘త్రిమూర్తి క్షేత్రం’గానూ విరాజిల్లుతున్నది. ధర్మపురిలో యమధర్మరాజు ఆలయం కూడా ఉన్నది. అందుకే, ‘ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదు’ అనే నానుడి ప్రచారంలో ఉన్నది.
క్షేత్ర ప్రాశస్త్యం…
ధర్మపురిలో నరసింహస్వామి యోగానందమూర్తిగా కనిపిస్తాడు. మూలవిరాట్ సాలగ్రామ శిలతో తయారుకావడం విశేషం. పూర్వం ధర్మవర్మ మహారాజు తన ప్రజలందరినీ ధర్మమార్గంలో నడిపించినందుకే ఈ క్షేత్రానికి ‘ధర్మపురి’ అనే పేరు వచ్చినట్లు స్థలపురాణం. నృసింహుడి గురించి ధర్మవర్మ తపస్సు చేశాడట. దీంతో స్వామివారు లక్ష్మీ సమేతుడై, యోగ నరసింహుడిగా అవతరించినట్లు చెబుతారు. ఈ క్షేత్రం పితృకర్మలకు ప్రసిద్ధి. కుజదోషం ఉన్నవారు స్వామివారి కల్యాణం జరిపిస్తే త్వరగా వివాహం అవుతుందని నమ్మకం.
యమధర్మరాజు ఆలయం
ధర్మపురిలో యమధర్మరాజు విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఏటా దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ నాడు యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజున స్వామివారిని దర్శిస్తే కష్టాలు దూరమవుతాయని నమ్ముతారు.
ఇలా చేరుకోవచ్చు
ధర్మపురి క్షేత్రం జగిత్యాల నుంచి 30 కిలోమీటర్లు. కరీంనగర్ నుంచి ధర్మారం, వెల్గటూర్ మీదుగా 70 కిలోమీటర్లు ప్రయాణిస్తే ధర్మపురి చేరుకోవచ్చు. మంచిర్యాల నుంచి 40 కిలోమీటర్లు. లక్సెట్టిపేట మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు.
నరసింహస్వామి అంటేనే.. నరుడు, మృగం కలగలసినరూపం. సింహం ముఖం, మానవ శరీరంతో కనిపించే రౌద్ర దేవుడు. కానీ, సింగోటంలో మాత్రం లింగ రూపంలో దర్శనమిస్తున్నాడు.
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో లక్ష్మీదేవి సమేతంగా వెలిశాడు నరసింహస్వామి. దేశంలో ఎక్కడా కనిపించని విధంగా, ఇక్కడ లింగ రూపంలో కొలువయ్యాడు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకొంటున్నాడు.
స్థల పురాణం..
సింగోటం ఆలయాన్ని క్రీ.శ.1795లో నిర్మించారు. జటప్రోలు సంస్థానాధీశుడు రాజా సింగమ నాయుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది. ఒకనాడు సింగమ నాయుడికి స్వామివారు కలలో కనిపించి, ఓ పొలంలో ఉన్నాననీ, తక్షణం తనను ప్రతిష్ఠింపజేయాలని చెప్పారట. అదే రాత్రి తన బలగంతో ఆ పొలానికి వెళ్లిన సింగమ నాయుడు స్వామివారు కలలో సూచించిన స్థలంలో విగ్రహాన్ని వెలికి తీశాడట. విగ్రహాన్ని తరలిస్తున్న వ్యక్తికి దేవుడు పూని, తాను లక్ష్మీనరసింహుడినని, అక్కడే ప్రతిష్ఠించాలని చెప్పగా, స్వామివారి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించారట.
శివ కేశవులనే భేదం లేకుండా!
సింగోటం ఆలయాన్ని రాణి రత్నమాంబ పునరుద్ధరించారని శాసనాలు చెబుతున్నాయి. సింగపట్నం లక్ష్మీనరసింహుణ్నిశ్రీవారని, స్వామివారి చెంతనే ఉన్న కోనేరును శ్రీవారి కోనేరని, పక్కనే ఉన్న తటాకాన్ని శ్రీవారి సముద్రమనీ పిలుస్తారు. స్వామివారి ఆలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న గుట్టపై లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ కొండకు రత్నగిరి అని పేరు. సింగపట్నంలో శివకేశవులనే భేదం లేకుండా ఆలయంలో శివలింగం, ఆంజనేయస్వామి, వినాయక విగ్రహాలున్నాయి. ఏటా సంక్రాంతి నుంచి వారం రోజులపాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు, తర్వాత 25 రోజులపాటు జాతర జరుగుతుంది.
ఇలా చేరుకోవచ్చు
మండల కేంద్రమైన కొల్లాపూర్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. మహబూబ్నగర్ నుంచి వనపర్తి మీదుగా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే సింగోటం చేరుకోవచ్చు.
నరసింహుడి ఉచ్ఛ్వాస.. నిశ్వాసలతో మహిమాన్వితంగా వెలుగొందుతున్నది నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి క్షేత్రం. పవిత్ర కృష్ణా, ముచుకుంద నదుల సంగమ తీరంలో కొలువై, పంచనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నది.
పూర్వం అగస్త్య మహాముని శివకేశవుల విగ్రహాలను అన్నపూర్ణ కావడిలో ఉంచుకొని, ముల్లోకాలు తిరుగుతూ భూలోకం చేరుకున్నాడట. కాశీకి వెళ్లే క్రమంలో కృష్ణా, ముచుకుంద నదుల సంగమం దగ్గర మజిలీ చేశాడట. సంధ్యా కోసం అన్నపూర్ణ కావడిని గోవులు కాసే పిల్లవాడికి ఇచ్చి, స్నానం చేసి వచ్చేవరకు దానిని కింద పెట్టవద్దని చెప్పి వెళ్లాడట. సంధ్య వార్చుకొని తిరిగి వచ్చి చూడగా, పిల్లవాడు కావడిని కింద పెట్టి వెళ్లిపోయాడట. కావడిని తిరిగి ఎత్తుకునే సమయంలో ఆకాశవాణి ద్వారా ‘ఈ ప్రాంతం పవిత్రమైనది.. ఇక్కడే ఉంటాను. నన్ను ఈ ప్రాంతంలోనే ప్రతిష్ఠించాలి’ అని స్వామివారు తెలిపారట. దాంతో అగస్త్యుడు స్వామివారి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి.
రెడ్డిరాజుల నిర్మాణం..
అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివకేశవుల విగ్రహాలు కాలక్రమేణా మట్టిలో కూరుకుపోయాయి. 14వ శతాబ్దంలో రెడ్డిరాజులు కోట నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తుండగా స్వామివారి విగ్రహాలు
బయటపడ్డాయట. వెంటనే అక్కడ ఆలయాలను నిర్మించారు.
స్వామివారి చెంత.. జ్యోతుల వింత!
ఇక్కడ స్వామి వారు కలిగించే వింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. స్వామి విగ్రహం ఎదుట రెండు జ్యోతులు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. అందులో స్వామివారి ముఖ భాగం ఎదుట ఉన్న జ్యోతి కదులుతూ ఉంటుంది. దీనికి స్వామివారి ఉచ్ఛ్వాస, నిశ్వాసలే కారణమని భావిస్తారు.
ఇలా చేరుకోవచ్చు
వాడపల్లి క్షేత్రం నల్గొండ నుంచి 84 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మిర్యాలగూడ నుంచి దామరచర్ల మీదుగా 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే, వాడపల్లి క్షేత్రానికి చేరుకోవచ్చు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వందల ఏండ్ల చరిత్ర ఉన్నది. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే అటవీ ప్రాంతంలో.. ఈ చారిత్రక ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నది.
హిరణ్యకశిపుడిని హతమార్చిన తర్వాత నరసింహుడు దండకారణ్యంలో తిరిగాడట. జానకంపేట కొండ ప్రాంతానికి వచ్చి, కాసేపు ఇక్కడే సేదతీరాడట. ఇక్కడే స్వయంభువుగా వెలిశాడట. అయితే, స్వామివారి ఉగ్రరూపాన్ని దర్శించడానికి రుషులకు సాధ్యపడలేదట. వారంతా శాంతమూర్తిగా దర్శనమివ్వాలని కోరగా, ఆయన ఆజ్ఞ మేరకు గండకీ నదీ తీరం నుంచి సాలగ్రామ శిలను తీసుకు వచ్చి నాభిలో ప్రాణ ప్రతిష్ఠ చేశారని స్థల పురాణం. నాభిలో సాలగ్రామం ఉండటం వల్ల సాలగ్రామ నరసింహుడిగానూ ప్రసిద్ధిగాంచింది.
మూడో శతాబ్దంలో ఈ ఆలయం వెనుక గురుకులాన్ని నిర్మించారు. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ లభించాయి. తర్వాతి కాలంలో కాకతీయుల పాలనలో ఇక్కడి గురుకులాన్ని శివాలయంగా మార్చారు. దీంతో జానకంపేట.. శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది.
అష్టముఖి కోనేరు..
ఆలయ ప్రాంగణంలో మరో విశేషం.. అష్టముఖి కోనేరు. మునుల తపస్సుకు ఆటంకం కలుగకుండా, బ్రహ్మ ఆజ్ఞతో అష్ట దిక్పాలకులు ఎనిమిది దిక్కుల్లో నిలబడి, వారికి కాపలాగా ఉన్నారట. వారి మధ్యలో నీటిని ఉద్భవించేలా చేశారట. దీంతో దీనిని ‘అష్టముఖి’ కోనేరని పిలుస్తారు.
ఇలా చేరుకోవచ్చు
నిజామాబాద్ నుంచి జానకంపేట 15 కి.మీ. బస్సులో, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లొచ్చు.
సహజసిద్ధ శ్వేతగిరి కొండల్లో స్వయంభువుగా శ్రీవారు వెలసిన దివ్య క్షేత్రం. స్వామివారి పాదాలను తాకుతూ పరవళ్లు తొక్కే పవిత్ర హరిద్రా నది ప్రవాహం. వెరసి రెండో యాదాద్రిగా భక్తజనుల ఆదరణ పొందుతున్నది.. నాచగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం.
ఐదువేల సంవత్సరాల క్రితం గార్గేయ మహర్షి తన శిష్యులైన నవనాథులతో కలిసి దేశ సంచారం చేస్తూ శ్వేతగిరి అనిపిలిచే నేటి నాచగిరి కొండలకు చేరుకున్నారట. ఎత్తయిన గుండ్లు, పాము పడగలాంటి బండరాయి కింద తపస్సు చేస్తూ, నిత్యం దేవుడి ఆరాధనలో మునిగిపోయేవారట. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో దిక్కులు పిక్కటిల్లేలా సింహగర్జన వినిపించిందట. దీంతో మహర్షితోపాటు నవనాథులు శ్వేతగిరి ప్రాంతంలో వెతకగా, స్వామివారు స్వయంభువుగా కనిపించారని స్థల పురాణం. నాటి నుంచి నిత్య పూజలందుకుంటూ, భక్తులకు అభయమిస్తున్నాడు నరసింహస్వామి.
భక్తుడి పేరుమీదే..
పూర్వం నాచర్ అనే భక్తుడు స్వామివారికి నిత్యసేవలు చేస్తూ ఉండేవాడట. తపఃఫలంతో ఆయన అవధూతగా మారాడట. ఆలయంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను నిర్ణయించడంతోపాటు ఇక్కడికి వచ్చేవారికి స్వామివారి లీలలు, మహిమలను వివరించేవాడట. ఆయన పేరుమీదే ఈ ప్రాంతం నాచగిరిగా రూపాంతరం చెందింది.
‘హరి’ద్రానది!
నాచగిరి క్షేత్రానికే తలమానికంగా నిలుస్తున్నది హరిద్రానది. శ్రీహరి (లక్ష్మీ నరసింహస్వామి) కొలువుదీరిన ప్రాంతంలో ప్రవహిస్తుండటం వల్ల ఈ నదికి ‘హరిద్రా నది’ అని పేరు వచ్చింది.
ఇలా చేరుకోవచ్చు
హైదరాబాద్ నుంచి తూప్రాన్ హైవే మీదుగా 55 కి.మీ. ప్రయాణిస్తే నాచగిరికి చేరుకోవచ్చు. తూప్రాన్ నుంచి గజ్వేల్ వెళ్లే బస్సుల్లో వెళ్తే నాచగిరిలో దిగొచ్చు.
అలరించే ప్రకృతి సౌందర్యం, కృష్ణా తరంగాల సారంగ రాగాల నడుమ వెలిసిన దివ్యక్షేత్రం మట్టపల్లి. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువుగా వెలిశాడు. శతాబ్దాల నుంచి భక్తులపాలిట కల్పతరువుగా విలసిల్లుతున్నదీ క్షేత్రం.
పూర్వం కృష్ణానదికి ఆవల గుంటూరు జిల్లా తంగెడ ప్రాంతాన్ని పరిపాలించే అనుముల మాచిరెడ్డి ప్రభువుకు ఒకనాడు స్వామివారు కలలో కనిపించి ‘మీ గ్రామానికి సమీపంలో కృష్ణానది ఆవలి తీరాన ఉన్న అరణ్యంలో స్వయంవ్యక్తంగా ఉన్నాన’ని చెప్పాడట. మర్నాడు మాచిరెడ్డి తన పరివారంతో ఆ ప్రాంతమంతా గాలించినా స్వామి జాడ కనిపెట్టలేకపోయారట. మనస్తాపం చెందిన మాచిరెడ్డి ఓ చెట్టుకింద విశ్రమించి నిద్రలోకి జారుకున్నాడట. కలలో ‘నిన్ను కనిపెట్టలేని బతుకు వృథా! ఇక్కడే తనువు చాలిస్తాన’ని మాచిరెడ్డి భీష్మించగా, స్వామి మళ్లీ కరుణించి, ‘ఎదురుగా ఆరె చెట్టుపై ఉన్న గరుడపక్షి, ఎగిరి ఎక్కడ వాలితే అక్కడే తాను ఉన్నాన’ని చెప్పాడట. దిగ్గున నిద్రలేచిన మాచిరెడ్డి గరుడపక్షి వాలిన చోట గుహను తొలగించగా అందులో లక్ష్మీనరసింహస్వామి కనిపించాడు. ఆనాటి నుంచి మట్టపల్లి మహాక్షేత్రంగా అలరారుతున్నది. అంతేకాదు, గుహ బయల్పడకముందు భరద్వాజాది మహర్షులు స్వామివారికి పూజలు చేసేవారని స్థల పురాణం. ఇప్పటికీ పలువురు మహర్షులు సూక్ష్మ రూపంలో స్వామివారిని దర్శించుకుంటారని చెబుతారు. కాలక్రమంలో భక్తుల రద్దీ పెరగడంతో గుహకు ఉత్తరం వైపు మరో ద్వారాన్ని ఏర్పాటుచేశారు. ఇప్పటికీ స్వామివారికి ఆరెపత్రితో పూజలు నిర్వహించడం కనిపిస్తుంది. ఏటా ఫాల్గుణంలో ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఇలా చేరుకోవచ్చు: హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు.. హైదరాబాద్ నుంచి కోదాడ (175 కి.మీ) వెళ్లాలి. అక్కడి నుంచి హుజూర్నగర్ మీదుగా మట్టపల్లికి (41 కి.మీ.) చేరుకోవచ్చు.
ఎత్తయిన గుట్టపై వెలిసిన యోగ నరసింహ క్షేత్రం నర్సింహులపేట. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి మూడుకిలోమీటర్ల దూరంలో కొండపై కొలువుదీరాడు స్వామి. దేవుడు ఉన్న గుట్టను నరసింహాచలం అనీ, దేవునిగుట్ట అనీ పిలుస్తారు. ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి 1437 నాటి శాసనంలో ఉంది.
కపిల మహర్షి కోరిక మేరకు స్వామివారు ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కొండపై ఉన్న నరసింహ మూర్తులలో ఒకదానిని కపిల యోగానంద నరసింహమూర్తిగా పిలుస్తారు. స్వామివారు సాక్షాత్కరించిన సమయంలో కపిల మహర్షితోపాటు మునులు వేదమంత్రాలతో పూజలు చేశారట. కీర్తనలు పాడారట. అవి చెవినపడటంతో గ్రామపెద్ద కొండకేసి వెళ్లాడట. కొండపై రెండు నరసింహస్వామి విగ్రహాలు తప్ప మరెవరూ కనిపించలేదట. అదే రోజు రాత్రి గ్రామపెద్ద కలలో స్వామివారు కనిపించి ‘నన్ను రుషులు కీర్తిస్తుండగా వచ్చి, అర్చనకు భంగం కలిగించావు. నాకు ఆలయం నిర్మించి పూజలు చేయించు’ అని ఆదేశించాడట. స్వామివారి మాట ప్రకారం కొండపై ఆలయం కట్టించాడట గ్రామపెద్ద.
కొండపై ఆలయంలో రెండు నరసింహస్వామి విగ్రహాలు ఉండటం ఇక్కడ విశేషం! ఒకటి యోగానంద నరసింహుడు, రెండోది కపిల యోగానంద మూర్తి. అతి పురాతనమైన ఈ ఆలయం అత్యంత శక్తిమంతమైనదిగా భావిస్తారు. ఆలయంలో గర్భగుడి, అంతరాళం, ఆళ్వారుల సన్నిధి, ముఖమంటపం ఉన్నాయి. గుడికి వాయవ్యంగా కోనేరు ఉంది. దీంతోపాటు మరో ఐదు కోనేర్లు కనిపిస్తాయి. నర్సింహులపేట గ్రామంలోనూ మరో నరసింహస్వామి ఆలయం ఉంది. కొండపై దేవుడి ఉత్సవమూర్తులకు ఇక్కడ పూజలు చేస్తుంటారు.
ఇలా చేరుకోవచ్చు: నర్సింహులపేట గ్రామం తొర్రూరు నుంచి 21 కి.మీ., మహబూబాబాద్ నుంచి 30 కి.మీ. దూరంలో ఉంటుంది. రవాణా సౌకర్యం ఉంది.