Lighting Lamp Rules | హిందువులు.. ప్రత్యేకించి మహిళలు ఉదయాన్నే లేచి స్నాన పానాదులు ముగించుకుని దేవుడికి పూజలు చేస్తారు. పండుగలు వచ్చినా, ఇంట్లో పెండ్లి, ఇతర శుభకార్యాలు జరిగినా ప్రత్యేక పూజలు తప్పనిసరి. ఈ పూజల్లో దీపారాదనకు ప్రత్యేక స్థానం ఉంది.రోజూ దేవుడికి పూజ చేసినా, పెండ్లిండ్లు, ఇతర శుభకార్యాలు జరిగినా తొలుత దేవుడికి దీపం వెలిగించి, అటుపై మంగళ హారతి పడతారు. దీపం వెలిగించకుండా ఏ పూజ చేసినా అది అసంపూర్ణమేనని అంటారు. దీపం వెలిగించాలంటే కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిందే.
దీపం వెలిగించడంలోనూ కొన్ని పద్దతులు పాటించినప్పుడు మాత్రమే తమ పూజకు శుభ ఫలితాలు పొందగలరు. పూజ చేస్తున్నప్పుడు వెలిగించే దీపపు కుందులు పరిశుభ్రం చేసుకోవాలి. దీపం వెలిగించే కుందులు దెబ్బ తినకూడదు. అటువంటి కుందుల్లో దీపం వెలిగించినా, పూజ ముగిసే లోపు దీపం ఆరిపోయినా అపశకునంగా భావిస్తున్నారు. కనుక పూజ ప్రారంభించడానికి ముందే దీపంలో తగిన మోతాదులో నూనె గానీ, నెయ్యి గానీ ఉండేలా చూసుకోవాలి. అలా చేయడం వల్ల పూజ ముగిసే లోపు దీపం ఆరిపోకుండా ఉంటది.
పూజ చేస్తున్నప్పుడు పూజ దీపం మినహా ఏ ఇతర దూపం దీపం వెలిగించరాదు. పూజ చేస్తున్నప్పుడు నెయ్యి దీపం వెలిగిస్తే, మరో నూనె దీపం వెలిగించకూడదు. దీపాన్ని పూజా స్థలం మధ్యలో దేవుడి విగ్రహం ముందు ఉంచాల్సి ఉంటుంది. నెయ్యి దీపం వెలిగిస్తే మీకు ఎడమవైపు, నూనె దీపం వెలిగిస్తే మీకు కుడివైపు ఉంచాలి. ఇక ఎప్పుడూ పూజాస్థలంలో దీపాన్ని పడమర దిశలో పెట్టకూడదు. నూనె దీపంలో ఎర్రటి వత్తిని వినియోగించడం శుభప్రదం అని అంటారు. ఇంటి దీపానికి దూది ఉపయోగించవచ్చు.