గురువారం స్వామి వివేకానంద జయంతి
‘మిత్రమా! నువ్వు ఆరడుగుల మనిషివి కావు.. భూనభోంతరాలు పరివేష్టించిన విశ్వవ్యాపక దీర్ఘదేహుడవు. నువ్వు ప్రకృతిని శాసించే పరమాత్మవు. నీవు బద్ధుడవు కావు.. కర్మాతీతుడవు. మృత్యురూపుడవు కావు.. మృత్యుంజయుడవు. భృత్యుడవు కావు.. రాజాధిరాజువు. నీవు జీవుడవు కావు! సాక్షాత్తూ శివుడవు..!’ ఇవి న్యూయార్క్ నుంచి స్వామి వివేకానంద కోల్కతాలోని తన సోదర శిష్యుడికి రాసిన లేఖలో పంక్తులు. ఆయన ఏ ఒక్కరికో చేసిన ఉపదేశం కాదది. నిద్రాణమై ఉన్న భారత యువతకు చేసిన మార్గదర్శనం. ఆయన జీవితంలో ప్రతి సందర్భం.. ప్రత్యేక విషయాన్ని బోధిస్తుంది. జీవితాన్ని తీర్చిదిద్దుకునేలా ప్రోత్సహిస్తుంది.
ఒకసారి వివేకానంద పశ్చిమ అమెరికాలోని ఓ నగరంలో పర్యటిస్తూ ఓ సభలో ప్రసంగిస్తున్నారు. ఇంతలో ఓ విదేశీ యువకుడు లేచి ‘సర్! మనిషి తాను అనుకున్నది సాధించాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి?’ అని ప్రశ్నించాడు. అప్పుడు వివేకానంద ‘మనోనిగ్రహం! మనసును స్థిరంగా ఉంచుకున్న వ్యక్తి ప్రశాంతతను బాహ్యపరిస్థితులు ఏ మాత్రం భంగం కలిగించలేవు’ అన్నారు. ఆ ప్రసంగం విన్న తరువాత అక్కడి కొంతమంది యువకులు వివేకానంద తాను చెప్పిన మాటల్ని ఆచరణలో పెడతారా! లేదా! అని పరీక్షించాలని భావించారు. తాము ఉంటున్న పట్టణంలో ప్రసంగానికి ఆహ్వానించారు. బోర్లించిన తొట్టెమీద నిలబడి మాట్లాడమని చెప్పారు. వివేకానంద తొట్టెపైనే నిలబడి ప్రసంగిస్తూ, అందులోనే లీనమైపోయారు. ఇంతలో ఆ యువకులు స్వామీజీ చెవుల పక్క నుంచి గుళ్లు వెళ్లేలా తుపాకీ పేల్చసాగారు. అయినా వివేకానంద కించిత్తు చలించకుండా నిర్భయంగా, తన ప్రసంగాన్ని ప్రశాంతంగా కొనసాగించి, ముగించారు.
వివేకానంద తరచూ భగవద్గీతలోని కర్మయోగాన్ని ప్రస్తావించేవారు. అందులోని రెండో అధ్యాయమైన సాంఖ్యయోగంలోని ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం…’ అన్న శ్లోకాన్ని పదేపదే ఉటంకించేవారు. మానసిక బలహీనతే అన్నిటి కన్నా హేయమైందని విస్పష్టం చేసేవారు. ‘భగవంతుడిపై నమ్మకం ఉన్నవాడిని ఆస్తికుడని, నమ్మనివాడిని నాస్తికుడని అనడం ఆనాటి మాట. కానీ, తనపై తనకు నమ్మకం ఉన్నవాడిని ఆస్తికుడని, ఆ నమ్మకం లేనివాడిని నాస్తికుడని నేనంటాను’ అంటారు స్వామి వివేకానంద. భక్తి పేరుతో, ఆధ్యాత్మికత పేరుతో బాధ్యతల్ని విస్మరించటం పలాయనవాదం. తనపై తనకు విశ్వాసం ఉన్నవాడికే ఆ సర్వేశ్వరుడి సహకారం అందుతుందని పునరుద్ఘాటించారు స్వామి వివేకానంద.
– మనోజ్ఞ