ఏరువాక పున్నమి ప్రాధాన్యం వివరించండి? – వై.రామకృష్ణ, నిజామాబాద్
జ్యేష్ఠ పౌర్ణమిని కర్షకులు ‘ఏరువాక పున్నమి’గా చేసుకుంటారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అనీ, ఏరువాక అంటే దున్నడానికి వెళ్లడమనీ అర్థం. మొదట్లో దీన్ని ‘ఏరు పోక’ అనేవారు. అదే క్రమంగా ఏరువాకగా మారింది. తొలకరి జల్లులు కురిసి ప్రకృతి అంతా చల్లదనంతో పులకరించే సమయంలో ఈ పండుగ వస్తుంది. మనుషుల మనుగడకు మూలాధారం వ్యవసాయం. సాగుబడిలో సాగిపోయే రైతులు చేసుకునే పండుగ ఇది. జ్యేష్ఠ మాసంతో వానాకాలం మొదలవుతుంది. దాదాపు ఇదే మాసంలో వర్షాలకు అనువైన మృగశిర కార్తె వస్తుంది. ప్రాచీన కాలంలో సేద్యం వర్షాల ఆధారంగానే నడిచేది. అందుకే మృగశిర కార్తె ప్రవేశించగానే, సమృద్ధిగా వానలు కురవాలని దైవాన్ని ప్రార్థించేవారు.
తొలకరి పలకరించగానే, రైతులు ఆనందోత్సాహాల మధ్య దున్నకాలు మొదలుపెడతారు. దీనికిముందు పంట పనుల్లో తమకు చేదోడువాదోడుగా ఉండే పశువులను పూజిస్తారు. భూదేవిని పూజించడంతోపాటు పశువులను, నాగలి, పార, గునపం వంటి పరికరాలను శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. ఎడ్లను చక్కగా అలంకరించి, వాటి కొమ్ములకు రంగులు అద్దుతారు. పంట పనుల్లో తమకు అండగా నిలవాలని ప్రార్థిస్తారు. పొంగలి వండి వాటికి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత రైతులంతా ఉమ్మడిగా పొలంలో దుక్కులు దున్నే కార్యక్రమం చేపడతారు. పండుగ వేళ ఆడపిల్లలను ఇంటికి పిలిచి సారె సమర్పించే సంప్రదాయమూ ఉంది. కొన్నిచోట్ల ఎడ్ల పందేలు కూడా నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్లకు బండలు కట్టి పోటీలు నిర్వహిస్తారు.
– డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370