‘దేవ పితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యమ్’ అంటే దేవకార్యం, పితృకార్యాల్లో అశ్రద్ధ పనికిరాదని, పితృకార్యం అంటే శ్రాద్ధాది కర్మలేనని తైత్తిరీయ ఉపనిషత్ బోధిస్తుంది. పూర్వం విష్ణుదత్తుడు అనే దత్తాత్రేయ భక్తుడు ఉండేవాడు. పితృదేవతల పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవాడు. విష్ణుదత్తుడు ఎంతో శ్రమపడి దత్త దర్శనం కోసం రెండుసార్లు ప్రయత్నించి విఫలమవుతాడు. మూడోసారి పట్టుదలతో స్వామిని ప్రసన్నం చేసుకోగలుగుతాడు. స్వామి ఏదైనా కోరుకో అని అడిగితే.. ‘రేపు మా తండ్రి శ్రాద్ధం. భోక్తగా మీరు రావాలి’ అని కోరుకుంటాడు విష్ణుదత్తుడు. సరేనంటాడు దత్తుడు. అన్నమాట ప్రకారం మరుసటి రోజు విష్ణుదత్తుడి ఇంటికి చేరుకుంటాడు దత్తాత్రేయుడు. స్వామికి ఉపచారాలు చేస్తారు ఆ దంపతులు.
ఇంతలో స్వామి.. ‘మీ తండ్రి శ్రాద్ధం అన్నావు! మరి రెండో భోక్త ఎక్కడ?’ అని అడుగుతాడు. వెంటనే పరమ పతివ్రత అయిన విష్ణుదత్తుడి భార్య సూర్యుణ్ని సహభోక్తగా రమ్మని ప్రార్థిస్తుంది. సూర్యుడు భోక్తగా వస్తాడు. దత్తుడు ఆ దంపతులను మరింత పరీక్షించాలని.. ‘ఇద్దరు బ్రాహ్మణులతోనే తద్దినం లాగించేద్దాం అనుకుంటున్నావా?’ అంటాడు. విష్ణుదత్తునికేం చేయాలో తోచలేదు. తన భార్య ఈసారి అగ్నిదేవుడిని భోక్తగా రావాలని కోరగా, ఆయనా దిగివచ్చాడు. దత్త స్వామి ఆ పతివ్రతామణి శక్తిని, దంపతుల సంస్కారాన్ని మెచ్చుకున్నాడు. సూర్యుడు, అగ్ని, దత్త స్వామి భోక్తలుగా వచ్చిన శ్రాద్ధం ‘న భూతో న భవిష్యతి’. దత్త స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఆశువుగా అష్టోత్తర శతనామ స్తోత్రం చెప్పాడు. దత్త స్వామి కరుణించి ‘విష్ణుదత్తా! ఈ స్తోత్రం నిత్య పారాయణం చేసే వాడి కోరికలు తీరుస్తాను’ అని అభయమిచ్చాడు.