అష్టమ స్కంధంలో ఇష్ట భక్త రక్షణ కళా విశిష్టమైన గజేంద్ర మోక్షణ ఘట్టం తర్వాత మరో ఉత్కృష్టమైన కథ క్షీరసాగర మథనం. తన భక్తులపట్ల గల పక్షపాతంతో భగవానుడు పుండరీకాక్షుడు జగన్మోహిని అవతారం ధరించిన అమృత మథన వృత్తాంతం మూలంలో అష్ట అధ్యాయాలలో చాలా సంక్లిష్టంగా అభివర్ణించబడింది. భక్తకవి వతంసుడు పోతన అమాత్యుడు ఈ ప్రసంగాన్ని తన భాగవతంలో అత్యంత రసపుష్టంగా, ఎంతో విశిష్టంగా అనువదించాడు.
మొదట కథను వక్కాణించి మీదట వేదాంత జిజ్ఞాసువుల వ్యథను నిర్మూలించే అంతరార్థాన్ని- అధ్యాత్మ తత్తాన్ని, నీతిని విజ్ఞాన దృక్కోణంలో బోధించడం విలక్షణమైన భాగవత రీతి. కథ లౌకిక భాష! అధ్యాత్మ బోధ అలౌకికమైన సమాధి భాష. ‘ఆత్మను- నిజస్వరూపాన్ని విస్మరిస్తే దాపురించే దుర్గతిని ‘గజ మోక్షణ’ కథ అక్కజపరచే విధంగా చక్కగా వివరించింది. అలా మరచిన ఆత్మను మరలా స్మరించే-పొందే సాధనను, అందలి విఘ్నాలను, పాటించాల్సిన జాగరూకతలను వీనుల విందుగా తెలుపుతుంది ఈ సాగర మథన కథ!’ అంటూ ఈ అంతరార్థాన్ని శ్రీమాధవతీర్థ స్వామి తన గుజరాతీ అధ్యాత్మ భాగవతంలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ దృష్టితో వారిధి (సాగర) మథన ప్రసంగాన్ని వారణ (గజేంద్ర) మోక్షణ కథకు అనుబంధంగాను, పరిశిష్టంగాను భావించవచ్చు. ‘మన్వంతరం’ (కాల విశేషం) లక్షణంగా కలిగిన ఈ స్కంధంలోని క్షీరసాగర మథన కథనంలో ‘ధన్వంతరి’ గరిమతో కూడిన శ్రీహరి
మరో అవతారం. ఏయే కాలాల్లో అచ్యుత భగవానుడి అవతారాలు ఏర్పడినవో, ఎనిమిదో స్కంధం అనువుగా చెప్పింది. సాగర మంథనం ఆరోదైన చాక్షుష మన్వంతరంలో ఆర్భాటంగా జరిగింది.
‘సంభూతి వైరాజ దంపతులకు శ్రీహరి ‘అజిత’ అనే నామంతో పుత్రుడుగా అవతరించి, కవ్వమైన మందరగిరికి కూర్మరూపంతో కుదురుగా నిలిచి అర్ణవాన్ని- సముద్రాన్ని చిలికి అమరులకు అమృతాన్ని అమర్చిపెట్టాడు’ అని శుకముని వినిపించగా ప్రభవిష్ణుని కథలు ఎన్ని విన్నా అలుపెరుగని, తనివి తీరని అవనీపతి పరీక్షిత్తు.. ముని ముఖ్యుని- శుకుని ఇలాగని ప్రశ్నించాడు…
మ॥ ‘విను, ము న్నేటికిఁ ద్రచ్చె పాలకడలిన్ విష్ణుండు? కూర్మాకృతిన్
వనధిం జొచ్చి యదెట్లు మోచె బలుకవ్వంబైన శైలంబు? దే
వ నికాయం బమృతంబు నెట్లు వడసెన్? వారాశి నేమేమి సం
జనితం బయ్యె? మునీంద్ర! చోద్యము గదా సర్వంబుఁ జెప్పంగదే’!
మునీంద్రా! పూర్వం మాధవుడు పాలకడలిని అపూర్వంగా ఎందుకు చిలికాడు? వారిధిలో దిగి పెద్ద కవ్వపు గిరి (కొండ)ని అసురవైరి హరి కూర్మరూపంతో ఎలా మోశాడు? అమృతాన్ని అమరులకు మాత్రమే ఎలా అందించాడు? పయోధి (సాగరం)లో ఏమేమి పుట్టాయి? పరమర్షీ! విస్మయం కలిగించే ఈ విషయాలన్నీ నాకు విశదంగా వినిపించు.
అమరేశ్వరుడు అమరావతిలో ఐరావతం అధిరోహించి ఊరేగుతూ ఉన్నాడు. ఎదురేగుతున్న దుర్వాస మహర్షి ఒక అప్సరస- వారిజాక్షి తనను అర్చించి సమర్పించిన పారిజాత పుష్పమాలను ధరించి ఉన్నాడు. అది అమ్లానం! ఎన్నటికీ వన్నె తరగనిది, వాడిపోనిది! వాస్తవానికి వాసికెక్కిన మహాత్ముల ప్రసాదం ఎప్పటికీ మాసిపోనిదే కదా! దుర్వాస మునీంద్రుడు ఆ మాలను అనుగ్రహ రూపంగా అమరేంద్రునికి అందించాడు. ఐశ్వర్యమద గర్విష్టుడై భ్రష్టమతి అయిన త్రివిష్టప (స్వర్గలోక)పతి ఇంద్రుడు శిష్ట మర్యాదను అతిక్రమించి ఆ దండ తాను ధరించక జంభంగా వేదండ (ఏనుగు) కుంభస్థలానికి తగిలించాడు. ‘సంపన్నుం డొరుఁగాన లేడు తనువున్ సంసారమున్ నమ్మి’- ధనమదాంధుడు తన తనువును (దేహాన్ని), మనువును- సంసారాన్ని నమ్మి ఇతరులెవ్వరినీ కన లేడు- ఖాతరు చెయ్యడు, వినలేడు- గౌరవించడు. జారి కిందపడిన పారిజాత మాలికను ఆ మదప్రాణి కరి కాలితో తొక్కుతూ వెళ్లింది. కనుక, ప్రసాదాన్ని కూడా ఆత్రపడక పాత్రతను పరీక్షించే ఇవ్వాలి. ఇదంతా తన కంటి ముందే జరగడం చూసి ముక్కంటి- రుద్రాంశ సంభూతుడైన దుర్వాసుడు అగ్గిమీద గుగ్గిలమై మహేంద్రునిపై మండిపడ్డాడు.. ‘అరే! మూఢుడా! మెరిసే ఏ ఐశ్వర్యాన్ని చూచి మురిసిపోతూ నువ్వు ఇలా మిడిసిపడుతున్నావో, అదంతా కదలిపోయి పాలకడలిలో కలసిపోగాక!’ అని శపించాడు. ‘సంపన్నాంధున కంజనంబు యిలలో దారిద్య్రమూహింపగన్’- అని భాగవతం దశమ స్కంధంలో దేవర్షి నారదుని దివ్య భాషణం! సంపద మదంతో వివేక భ్రష్టుడైన వ్యక్తి దరిద్రుడు కాకుండా మరి వివేకవంతుడు కాలేడు! కాన, ధనమదాంధులకు కనువిప్పు కలిగించి పెనుముప్పు తొలగించేది దారిద్య్రమనే దివ్య అంజనమే- కాటుకే ఔషధం.
కం॥‘కసి మసఁగి యసుర విసరము
లసి లతికల సురల నెగువ నసువులు వెడలం
బసఁ జెడిరి, పడిరి, కెడసిరి
యసమ సమర విలసనముల నను వెడలి నృపా!’
శుక ఉవాచ… ఓ రాజా! దుర్వాసుని శాపం వల్ల లోకాలన్నీ నిర్వీర్యమై- శక్తిహీనమై పోయాయి. వైభవం, ప్రాభవం పోగొట్టుకున్నాయి. దానవులు ఆయుధాలు ధరించి విజృంభించి దేవతలను మించి సాటిలేని మేటి పోరాటాలు చేశారు. అసురులు సమర పాటవం (యుద్ధశక్తి) కోల్పోయి ఆరాటపడుతూ అసువులు (ప్రాణాలు) అర చేతుల్లో పెట్టుకొని అరి- శత్రు బృందాలపై కసి తీర్చుకునే తీరు తెలియక డెందాల (హృదయాల)లో తల్లడిల్లిపోయారు. దేవేంద్రునితోపాటు దేవతలు దైత్యుల చేతిలో ఓడిపోయారు. వేడుకలన్నీ విబుధు (దేవత)లను వీడిపోయాయి. వేల్పులు కాంతిని కోల్పోయి విధాత (బ్రహ్మ)ను ఆశ్రయించగా ఆయన జగత్ సంధాతను- అజిత భగవానుని విజితేంద్రియుడై- ఏకాగ్ర చిత్తంతో స్తుతించాడు..
కం॥‘మొదల జల మిడిన భూజము
దుది నడుమను జల్లఁ దనము దొరఁకొను మాడ్కిన్
మొదలను హరికిన్ మ్రొక్కిన
ముద మందుదు మెల్ల వేల్పుమూఁకలు నేమున్’
చెట్టుకు మూలం- మొదట్లో నీళ్లు పోస్తే అవి గుట్టుగా నడుమ- మధ్యలోను, కొనకొమ్మలకు, రెమ్మలకు జడిమ లేక ఇమ్ముగ- చక్కగా వ్యాపించి చల్లదనం చేకూర్చునట్లు, ఎదుట కనిపించిన మొదటి వేల్పువైన (ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృత్ గురుః.. విష్ణు సహస్ర నామాలు) నీకు మొక్కితే దేవతలు, నేను ముదం- సంతోషం పొందుతాం. మా మనస్సులు కుదుటపడతాయి. (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006