TTD News | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం అమ్మవారు సూర్యనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ కొనసాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.
వాహనసేవల్లో పెద్ద జీయర్స్వామి, చిన్న జీయర్స్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ రాములు, జేఈఓ వీర బ్రహ్మం దంపతులు పాల్గొన్నారు.