Brahmotsavam | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవిమాలలు గురువారం తిరుమలకు చేరుకున్నాయి. ముందుగా తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద పెద్దజీయర్ మఠానికి మాలలను తీసుకొచ్చారు. అక్కడ పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అక్కడినుంచి ఈవో ఏవీ ధర్మారెడ్డి, తమిళనాడు దేవాదాయశాఖ జాయింట్ కమిషనర్ సెల్లదొరై, శ్రీవిల్లిపుత్తూరు ఆలయ ఈవో ముత్తురాజ, ట్రస్టుబోర్డు సభ్యుడు మనోహరన్ కలిసి ఆలయ మాడవీధుల గుండా మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా గోదాదేవి మాలలను శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవిమాలలను తిరుమల శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వీటిని గరుడసేవలో స్వామివారికి అలంకరిస్తామని తెలిపారు.
శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన మాలలను గరుడసేవ రోజు స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని రంగమన్నార్స్వామివారి ఆలయానికి గోదాదేవి తండ్రి పెరియాళ్వార్ పుష్పకైంకర్యం చేసేవారని, రంగనాథునిపై అనన్యభక్తి కలిగిన గోదాదేవి పూలమాలలను మొదట తాను ధరించి తర్వాత స్వామివారికి పంపేవారని పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన పెరియాళ్వార్ తన కుమార్తెను మందలించారని, ఆ తర్వాత గోదాదేవి ధరించకుండా పంపిన మాలలను రంగనాథుడు తిరస్కరించారని పురాణ గాథ. గోదాదేవి శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారంగా భావిస్తుంటారు.