TTD news | హైదరాబాద్లో ఇవాల్టి నుంచి శ్రీవారి వైభవోత్సవాలు జరుగనున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరుగనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టీటీడీ బోర్డు శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నది. ఈ ఉత్సవాల కోసం సోమవారం సాయంత్రం వైదిక క్రతువులు ప్రారంభమయ్యాయి. అంకురార్పణంలో భాగంగా పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, వాస్తుశాంతి, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.
ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర, ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు వారపు సేవ, ఉదయం 10 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. అదేవిధంగా, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు.
వారపు సేవల్లో భాగంగా తొలి రోజున మంగళవారం నాడు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు వసంతోత్సవం, అక్టోబరు 12న ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు సహస్ర కలశాభిషేకం, అక్టోబరు 13న ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు తిరుప్పావడ, అక్టోబరు 14న ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు అభిషేకం, ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిజపాదదర్శనం, అక్టోబరు 15న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.
విస్తృత ఏర్పాట్లు
నమునా ఆలయం వద్ద సేవల నిర్వహణకు ఆకట్టుకునేలా స్టేజి ఏర్పాటు చేశారు. భక్తులు కూర్చుని సేవలను దర్శించేందుకు వీలుగా కుర్చీలు, ఎండకు, వానకు ఇబ్బంది లేకుండా విశాలమైన జర్మన్ షెడ్ ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు నెలకొల్పారు. శ్రీవారి కల్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్నప్రసాదాల వితరణకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయ అర్చకస్వాములు, పరిచారకులు స్వామివారి కైంకర్యాలు నిర్వహిస్తారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంగీత కార్యక్రమాలు, దాస సాహిత్య ప్రాజెక్టు, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. గోసంరక్షణ, గో ఆధారిత ఉత్పత్తులపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎస్వీబీసీ ఈ కార్యక్రమాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. పంచగవ్య ఉత్పత్తులతో పాటు 2023 డైరీలు, క్యాలెండర్లు భక్తులకు అందుబాటులో ఉంచారు.