TTD News | కార్తీక వనభోజనం సందర్భంగా తిరుమలలోని వైభవోత్సవ మండపంలో శాస్త్రోక్తంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో పార్వేటి మండపం వద్ద కార్తీక వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కార్తీక వనభోజనాన్ని టీటీడీ రద్దు చేసింది.
వన భోజనాలు రద్దు చేసినప్పటికీ స్వామివారికి ఎప్పటిమాదిరిగానే వైభవోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం వైభవంగా చేపట్టారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.