తిరుమల : టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీవారి సేవకుల సమష్టి కృషి, భక్తుల సహకారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యాయని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఎవి.ధర్మారెడ్డితో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎంతో భక్తిభావంతో వాహనబేరర్లు వాహనాలను మోశారని అభినందించారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తం 5.69 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని వివరించారు.
ఒక్క గరుడసేవనాడే స్వామివారిని 81,318 మంది దర్శించుకోగా, గరుడసేవలో మూడు లక్షల మందికిపైగా భక్తులు పాల్గొన్నారని పేర్కొన్నారు. 24.89 లక్షల లడ్డూలను విక్రయించామని , హుండీ ఆదాయం రూ.20.43 కోట్లు వచ్చిందని తెలిపారు. 2.20 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారని చెప్పారు. ఎనిమిది రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల రోజుల్లో 20.99 లక్షల మందికి భోజనాలు, అల్పాహారం అందించామని చైర్మన్ తెలిపారు.
హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన 91 కళాబృందాల్లో 1906 మంది కళాకారులు వాహన సేవలతో పాటు తిరుమల, తిరుపతిలో ప్రదర్శించిన కళాకృతులు విశేషంగా అకట్టుకున్నాయని వివరించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 147 బస్సుల ద్వారా 6,997 మంది వెనుకబడిన పేద వర్గాలవారిని ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహనసేవల దర్శనం చేయించామని తెలిపారు.