TTD News | వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఎల్లుండి విడుదల కానున్నాయి. 12 న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ బోర్డు విడుదల చేయనున్నది. అదేవిధంగా, 2023 జనవరి నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ ద్వారా అదేరోజు ఉదయం 10 గంటల నుంచి డిసెంబరు 14న ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తరువాత లక్కీడిప్లో టికెట్లు కేటాయిస్తారు. భక్తులు ఈ విషయాలను గుర్తించి శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ బోర్డు విజ్ఞప్తి చేసింది.
టీటీడీకి చెందిన బర్డ్ దవాఖానలో ఒకే రోజు ఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు నిర్వహించారు. శస్త్రచికిత్సలు చేసిన ఏడుగురు చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటంతో వారిని డిశ్చార్జి చేసినట్లు బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రాచపల్లె రెడ్డెప్పరెడ్డి తెలిపారు. శస్త్రచికిత్సలు నిర్వహించిన వైద్యబృందానికి టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి అభినందనలు తెలియజేశారు.
ఈ దవాఖానలో ఈ ఏడాది సెప్టెంబరులో గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు ప్రారంభించారు. ఇప్పటివరకు 20 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇందులోభాగంగా లోహిత (6 నెలలు), తన్విష్ (9 నెలలు), నాగహేమ (9 నెలలు), నాగలక్ష్మి (ఒక సంవత్సరం), రేఖ (2 సంవత్సరాలు), జాహ్నవి (3 సంవత్సరాలు), నవీన్ (12 సంవత్సరాలు) లకు ఈ నెల 5న శస్త్రచికిత్సల కోసం అడ్మిట్ అవగా.. డిసెంబరు 7న వీరికి గ్రహణమొర్రి శస్త్రచికిత్సలు చేశారు. వీరిలో ఇద్దరికి మాత్రం పెదవికి, అంగిలికి (నోటి లోపల) రెండింటికీ శస్త్రచికిత్సలు చేశారు. బెంగళూరుకు చెందిన విజిటింగ్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రీతమ్శెట్టి, డాక్టర్ దీపేష్ ఎన్. రావు, బర్డ్ దవాఖాన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఝాన్సీ ఈ శస్త్రచికిత్సలు చేపట్టారు.