శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీగిరులపై ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకునేందుకు తరలివచ్చిన వారితో ఆలయ పరిసరాలు, దారులన్నీ కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే భక్తులు పాతాళగంగలో స్నానాలు చేసి క్యూలైన్లలో బారులు తీరారు. శివన్నామస్మరణ చేస్తూ మల్లికార్జునుడి దర్శించుకున్నారు. ఆ తర్వాత భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో లవన్న తెలిపారు. ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు, ప్రత్యేక కంకణాలతో కాలినడకతో వచ్చే వారికి, దీక్షాపరులకు ప్రత్యేక కూలైన్ల ద్వారా దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఉదయం నుంచి రాత్రి వరకు కంపార్ట్మెంట్లలో బారులు తీరిన భక్తులకు మంచినీరు, మజ్జిగ, అల్పాహారం అందజేస్తున్నట్లు తెలిపారు. కాలినడకన వచ్చే భక్తులకు మార్గమధ్యలో అన్నదానాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. శివరాత్రి పర్వదినాన్ని ముందే క్షేత్రంలో ట్రాఫిక్ భారీగా పెరిగింది. క్రమంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని సంబంధిత అధికారులను ఈవో లవన్న ఆదేశించారు. ప్రధానంగా టోల్గేట్ వద్ద టికెట్ల జారీలో ఆలస్యం జరుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా దర్శనానంతరం మాడవీధుల్లో యాత్రికులను ఎప్పటికప్పుడు తరలించాలని ఆలయ భద్రతా సిబ్బందికి సూచించారు.