శ్రీశైలం : శ్రీశైల క్షేత్రాభివృద్ధికి ఆలయ పరిధిలో ఉండే ప్రతి ఒక్కరూ తప్పక సహకరించాలని ఆలయ ఈవో లవన్న కోరారు. శనివారం పరిపాలనా భవనంలో వ్యాపార సంఘంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజురోజుకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
అదే విధంగా ఉత్సవ మహోత్సవాలకు జరిగే గ్రామోత్సవాల్లో పాల్గొనే భక్తుల సంఖ్య కూడా అధికమవుతున్నందున ఆలయ ప్రధాన వీధుల విస్తరణ తప్పనిసరి అవుతున్నదని అన్నారు. ఈ విషయమై ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఆదేశాలను ఖచ్చితంగా అమలుపర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న వ్యాపార సముదాయాన్ని తరలించేందుకు ఇప్పటికే రూ.కోట్ల వ్యయంతో లలితాంబికా వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేసి సిద్ధింగా ఉంచినట్లు తెలిపారు.
అంతేకాక క్షేత్ర పరిధిలోని పొన్నూరు సత్రం వద్ద మరో నూతన వాణిజ్య భవన సముదాయాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ పరిసరాల అభివృద్ధికి దేవస్థానం నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి అధికారులు సిబ్బందితో సహకరించాలని కోరారు. సమావేశంలో పోలీస్ ఇన్స్పెక్టర్ దివాకర్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ నటరాజ్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీహరి, భద్రతా అధికారి నర్సింహారెడ్డి, పలు వర్తక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం ఆలయానికి వచ్చిన ఆయనకు ఈవో లవన్న పూలమాలతో స్వాగతం పలికి స్వామిఅమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అమ్మవారి ప్రాకార మండపంలో వేదాశీర్వచనం చేయించి స్వామిఅమ్మవార్ల తీర్థప్రసాదాలు అందించారు.