శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. గత 18 రోజుల్లో భక్తులు స్వామి అమ్మవార్లకు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాకారంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉభయ దేవాలయాల హుండీలతోపాటు పరివార దేవతాలయాల హుండీలను లెక్కించారు.
ఇందులో రూ.2,21,80,968 నగదు రూపంలో ఆదాయంగా వచ్చినట్లు ఈవో చెప్పారు. అదే విధంగా 95.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.7 కేజీల వెండి ఆభరణాలు, 277 యూఎస్ఏ డాలర్లు, 151 ఖతార్ రియల్స్, 52 సింగపూర్ డాలర్స్, 40 కెనడా డాలర్స్, 25 ఆస్ట్రేలియా డాలర్స్, 25 ఇంగ్లాండ్ పౌండ్స్, ఒకటి ఎస్ఏయూ రియల్ విదేశీ కరెన్సీ వచ్చాయని ఈవో వివరించారు.