TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 10న శ్రీరామనవమి సందర్భంగా ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీరాముడు హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. అలాగే సోమవారం శ్రీరామ పట్టాభిషేకం జరుగనున్నది. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో సీతారామ లక్ష్మణ సమేత హనుమంత ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 10 నుంచి 11 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది. 11న సోమవారం సాయంత్రం 5 గంటలకు సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ ఉత్సవర్లకు సహస్ర దీపాలంకార సేవ జరుగుతుంది. రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ బంగారువాకిలిలో అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు.