Srisailam | ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం బ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణమండపంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రికి చెందిన పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగ పఠనం చేశారు.
పంచాంగ శ్రవణం కంటే ముందు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు. ఈ సంకల్పంలో దేశంలో శాంతి సౌభాగ్యాలతో విల్లసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్ప పఠనం చేశారు. అనంతరం మహాగణపతి పూజ నిర్వహించారు. ఆ తర్వాత శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. పంచాంగ శ్రవణం అనంతరం ఆస్థాన సిద్ధాంతి క్రోధినామ సంవత్సర విశేషాలను వివరించారు. ఈ ఏడాది దేశమంతటా సగటు వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. ఉత్తరాదిలో నదులు పొంగి ప్రవహిస్తాయని అన్నారు.