శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు నిత్యకైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం ఉదయం పరివార దేవతలైన సాక్షి గణపతికి అభిషేకాలు పుష్పార్చనలు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. సాయంత్రం జ్వాలావీరభద్రుడికి ప్రదోషకాల షోడషోపచార పూజలు చేశారు. కార్తీక మాసం నిత్యపూజల్లో భాగంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని వెలిగించారు.
ప్రముఖుల పూజలు
భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను నంద్యాల నియోజకవర్గ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దర్శించుకున్నారు. బుధవారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వారిని ఈవో లవన్న అర్చక వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాల్లో స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్న వారికి అమ్మవారి ఆలయ ప్రాకారంలో అర్చకులు వేదాశీర్వచనాలు చేశారు. ఈవో లవన్న తీర్థప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. ఇదిలా ఉండగా.. విజయవాడకు చెందిన కే రాజబాబు జ్ఞాపకార్థం అమ్మాజీ అన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని ఈవోకు అందజేశారు.