శ్రీశైలం : మల్లికార్జున స్వామి భక్తులకు శ్రీశైలం దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 17 నుంచి ఆలయంలో ఐదు రోజుల పాటు స్పర్శదర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులను ఆదేశాల మేరకు జిల్లా అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ నెల 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
ఉత్సవాల సందర్భంగా గర్భాలయంలో స్పర్శ దర్శనాలు, అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా జనవరి 19 నుంచి గర్భాలయంలో స్పర్శ దర్శనాలు, అభిషేకాలు నిలిపివేశారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు అభిషేకం చేయించుకునే వారికి స్పర్శదర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉచితంగా సాధారణ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు వివరించారు.