TTD News | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం రాత్రి సింహ వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో పద్మావతి అమ్మవారు భక్తులకు కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు .
సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.
వాహనసేవలో పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, ఆగమ సలహాదారులు శ్రీనివాసచార్యులు, వీఎస్ఓలు మనోహర్, బాలి రెడ్డి, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి , ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరింటెండెంట్ మధు, ఆర్జితం ఇన్స్పెక్టర్ దాము పాల్గొన్నారు.