సుందరకాండ, గురుచరిత్ర, సాయి సచ్చరిత్ర సప్తాహ విధానంలో పారాయణం చేసినప్పుడు మొదటి రోజునే సంకల్పం చెప్తే సరిపోతుందా! ప్రతి రోజూ చెప్పాల్సి ఉంటుందా?
-ఎన్.రాంచందర్ రావు, హనుమకొండ
ఆపదల నుంచి గట్టెక్కడం కోసం, అభీష్టాలు నెరవేరడం కోసం, సంకల్పించిన కార్యక్రమాలు జయప్రదంగా కొనసాగాలని కోరుతూ సాంప్రదాయికంగా సుందరకాండ, శ్రీ గురు దత్తాత్రేయ, శ్రీ సాయి సచ్చరిత్రలను పారాయణం చేస్తుంటారు. పారాయణం ప్రారంభించడానికి ముందుగా సంకల్పం చెప్పాలి. ముందుగా ఇష్టదైవాన్ని ఆవాహనం చేసి పూజాదికాలు నిర్వహించి, నైవేద్యం సమర్పించాలి. తర్వాత అంగన్యాస కరన్యాసాదులు నిర్వహించి పారాయణం మొదలుపెట్టాలి.
‘ఉమా సంహిత’, ‘తత్త్వ సంగ్రహం’, ‘బ్రహ్మాండ పురాణం’ తదితర గ్రంథాలలో సుందరకాండ పారాయణ విధానం ప్రస్తావన కనిపిస్తుంది. ఆ నియమాలే మిగతా వాటికీ వర్తిస్తాయి. సుందరకాండ ప్రారంభించడానికి ముందు గురువులు, గణపతి, ఇష్టదైవంతోపాటు వాల్మీకి మహర్షి, ఆంజనేయుడు, రామాయణ కావ్యం, శ్రీరామచంద్రుడిని ప్రార్థించాలి. పారాయణం తర్వాత తిరిగి పూజ చేసి, నైవేద్యం సమర్పించి, మంగళహారతి ఇచ్చి, మంత్రపుష్ప నమస్కారం చేయాలి. ఏ రోజుకా రోజు ఇష్టదైవాన్ని ఆవాహనం చేసి పూజిస్తాం కాబట్టి, సంకల్పం కూడా రోజూ చెప్పాల్సి ఉంటుంది. గోత్రనామాలతోపాటు ప్రథమేహని, ద్వితీయేహని అని పారాయణం చేస్తున్న రోజు సంఖ్యను కూడా ప్రస్తావించాలని శాస్త్ర నియమం.
-డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370