TTD | తిరుమలలో సర్వభూపాల వాహనం ట్రయల్ రన్ను ఆదివారం నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మలయప్పస్వామి విహరించే అన్ని వాహనాల్లో సర్వభూపాల వాహనం ఎక్కువ బరువుగా ఉంటుంది.
వాహన సేవ సమయంలో వాహనబేరర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో ఆలయ పేష్కార్ శ్రీహరి, పార్ పత్తేదార్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. చెన్నైలోని అలమేలు మంగమ్మ చారిటబుల్ ట్రస్టుకు చెందిన పీ గోపాలకృష్ణ ఆదివారం తిరుమల శ్రీవారికి 10 గొడుగులు విరాళంగా అందించారు. తిరుమలలోని వైభవోత్సవ మండపం వద్ద బోర్డు సభ్యులు మూరంశెట్టి రాములు చేతులమీదుగా ఆలయ పేష్కార్ శ్రీహరికి గొడుగులు అందించారు.