జీవితంలో ఒక మేలి మలుపు వ్యక్తిని శక్తిగా నిలుపుతుంది. భానుడి ప్రయాణ దిశలో మలుపు ఉత్తరాయణంగా పలకరిస్తున్నది. సంక్రాంతి సంబురంతో ఉత్తరాయణ పర్వకాలం ప్రారంభమైంది. ఇన్నాళ్లూ తెలిమంచు తెరలతో జోగాడిన భానుడు.. సంక్రాంతి సందడితో మేలుకుంటాడు. తన కిరణ స్పర్శతో ప్రకృతి కాంతకు కొత్త ఉత్సాహాన్నిస్తాడు. శిశిరంతో పాతనంతా పాతరపెట్టి… వసంతంతో కొత్తదనాన్ని అందిస్తాడు. గ్రీష్మతాపంతో భయపెట్టినా.. వర్షరుతువుతో హర్షింపజేస్తాడు. ఉత్తరంగా ఆదిత్యుడి పయనం ఉత్తరోత్తర ఉత్తమ కాలానికి సంకేతం.
Sankranti | ‘సమ్యక్ క్రాంతి సంక్రాంతి’- అంటే మనోజ్ఞమైన క్రాంతి అని అర్థం. సౌరమానం ప్రకారం ప్రతినెలా ఒక్కో రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. ఇలా సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి. వాటిలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని అంటే మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా చేసుకుంటాం. నేటి నుంచి సూర్యుడి గమనం ఉత్తర దిశగా సాగుతుందని చెబుతారు. దేవతలకు పగటి వేళగా చెప్పే ఉత్తరాయణం ఆధ్యాత్మిక సాధనకు అనువైన సమయంగా పేర్కొంటారు. దక్షిణాయనం పండుగలకు ఆలవాలమైతే… ఉత్తరాయణం సాధకులకు అనువైన కాలం. సంక్రాంతి మొదలు వాతావరణంలో వేడి నిదానంగా పెరుగుతుంది. చలి తీవ్రత తగ్గుతుంది. మనిషికి రోగనిరోధకశక్తి పెరిగే కాలం ఇది. పంటలు సమృద్ధిగా పండే సమయం ఇది. వృక్షజాతులు సమృద్ధిగా ఫలించే తరుణమిది. అందుకే ఉత్తరాయణానికి ఇంత ప్రాధాన్యం.
మకర సంక్రమణం సందర్భంగా దేశవ్యాప్తంగా సంక్రాంతి పండుగ కోలాహలంగా జరుపుకొంటారు. తెలుగు రాష్ర్టాల్లో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పాటు సంక్రాంతి సంబురం కొనసాగుతుంది. సంక్రాంతి సందర్భంగా గడపకు పసుపు పెట్టి, గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలు కట్టి, రంగురంగుల రంగవల్లులతో వాకిళ్లను అందంగా అలంకరిస్తారు. ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతారు. ఇంట్లో పిండివంటలు, పరమాన్నం చేసి సంక్రాంతి పురుషుడిని శ్రీమన్నారాయణుడిగా భావించి ఆరాధిస్తారు. సంక్రాంతి నోము నోచుకొని, ముత్తయిదువలకు వాయనాలు సమర్పిస్తారు. తెలంగాణలో పండుగ సందర్భంగా వారం ముందునుంచే రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. అలా సంక్రాంతిని ‘అప్పాల పండుగ’ అనికూడా పిలుచుకుంటారు. ముఖ్యంగా నువ్వులు బెల్లంతో చేసిన ఉండలను ఇచ్చి పుచ్చుకుంటారు. బెల్లం-నువ్వులు దానం వల్ల గ్రహదోషాలు పరిహారం అవుతాయని నమ్మకం. అంతేకాకుండా, నువ్వుల లడ్డూలు ఈ కాలంలో శరీరానికి కావాల్సిన వేడిని, శక్తిని అందిస్తాయి. ఇలా ప్రతి ఆచారం వెనుక ఒక పరమార్థాన్ని నిక్షిప్తం చేశారు మన పెద్దలు.
మన సంస్కృతిలో ప్రతి పండుగ సారాంశం ఇతరుల మేలు కోరడమే. పంటలు ఇళ్లకు చేరే కాలంలో వచ్చే సంక్రాంతి కూడా అలాంటిదే. రైతులు తమ పొలంలో పని చేసిన కూలీలకు, అవసరార్థులకు తోచినంత ధాన్యం ఆత్మీయంగా దానం చేస్తారు. ఈ సమయంలోనే ఊరూరా తిరిగే హరిదాసులు, గంగిరెద్దులవాళ్లు, బుడబుక్కలవాళ్లకు ఎంతో కొంత సమర్పించుకుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సంక్రాంతితో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలం సమస్త మానవాళికి పుణ్యప్రదం.
ఆధ్యాత్మిక సాధనలన్నీ మోక్షాన్ని పొందడానికే! ఇహంలో సకల సంపదలతో తులతూగినా.. పరంలో సాధించాల్సిన స్థిరమైన సంపద మోక్షమే కదా! మహోన్నతమైన పురుషార్థాన్ని పొందడానికి అనువైన కాలం ఉత్తరాయణం. పవిత్రమైన, శాస్ర్తోక్త సత్కర్మలకు ఉత్తరాయణం ప్రధానమైందని ఆగమాలు చెబుతున్నాయి. శుద్ధికి, సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయమిది. ఉత్తరాయణాన్ని దేవయానంగానూ అభివర్ణిస్తారు. కాంతి, వెలుగు ఇచ్చే మార్గంగా దీన్ని చెబుతారు. దక్షిణాయనాన్ని పితృయానంగా చెబుతారు. ఇది చీకటి మార్గం, ధూమ మార్గం. వెలుగు మార్గంలో పయనించిన వారు, సూర్యుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ తత్త్వాన్ని గ్రహించిన ఉపాసకులు ఉత్తరాయణ కాలాన్ని ఆధ్యాత్మిక సాధనకు వినియోగించుకుంటారు.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా పితృదేవతలకు ప్రీతి కలిగించేలా తర్పణాలు విడుస్తారు. సంవత్సరంలో ప్రతి రవి సంక్రమణానికీ పితృదేవతలకు తర్పణాలు చేయలేని వారు, మకర సంక్రాంతి రోజున తర్పణాలిస్తే ఏడాదిలో అన్ని సంక్రాంతులకూ ఇచ్చినట్టేనని చెబుతారు. అంతేకాదు, సంక్రాంతి సందర్భంగా పితృదేవతలకు సద్గతులు కలగాలనే సంకల్పంతో వారిపేరిట దానధర్మాలు చేస్తారు. భూదానం, సువర్ణదానం, వెండిదానం, అన్నదానం, పుస్తకదానం, బియ్యం, పప్పు, ఉప్పు, గుమ్మడికాయ, చెరుకుగడలు, రేగుపండ్లు ఇలా శక్తి మేరకు దానాలు చేస్తారు.
– శ్రీవ్యాస్