శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జునస్వామి క్షేత్రంలో మకర సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడు రోజుల పంచాహ్నిక దీక్షతో నిత్యం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అలంకారాలు భక్తులను తన్వయత్వానికి గురి చేస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం షోడషోపచార క్రతువులు చేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. రుద్రహోమం, పూర్ణాహుతి, కళశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజాధికాలు జరిపించినట్లు పేర్కొన్నారు. ఆలయ పుష్కరిణిలో వైదిక శాస్త్రోక్తంగా అవబృదస్నానం చేయించిన తరువాత వసంతోత్సవాన్ని నిర్వహించారు.
సంక్రాంతి రోజు స్వామి అమ్మవార్లకు కల్యాణం జరిపిన అనంతరం సాంప్రదాయం ప్రకారం.. భ్రమరాంబదేవి అమ్మవారికి మెట్టెలు, నల్లపూసలు సమర్పించే సదస్యం నాగవల్లి కార్యక్రమం జరిపించారు. అనంతరం దేవత ఆహ్వానం కోసం ఆవిష్కరించిన ధ్వజపటాన్ని అవరోహణ చేసిన కార్యక్రమం ఆద్యంతం కన్నులపండుగగా జరిగింది. ఉత్సవాల్లో ఆఖరిరోజైన మంగళవారం స్వామిఅమ్మవార్లను అశ్వవాహనంపై అధిష్టింపజేసి ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో వివరించారు.
మానవ జీవనశైలికి పరమాధారమైనవి చతుర్వేదాలేనని.. ఓంకారం, శివ పంచాక్షరీ, గాయత్రీ మంత్ర బీజాక్షరాలకు మూలాధారమైనవని ఆలయ వేదపండితుడు ఘంటి రాధాకృష్ణ అన్నారు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో.. చతుర్వేదసభ, ఘనస్వస్తి కార్యక్రమాలను నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాల నుంచి వచ్చిన 24 మంది ఘనాపాటి సంస్కృత వేదపండితులు, 09 మంది శ్రీశైల దేవస్థాన వేదపండితులచే మూడు గంటల పాటు నిరంతరాయంగా సామవేదం, ఋగ్వేదం, అధర్వణవేదం, యజుర్వేద పఠనం చేశారు.
సామాన్యులకు కూడా వేదసారాలు అర్థమయ్యే ఆవశ్యకత ఉన్నందున ప్రత్యేకంగా వేదసభ నిర్వహించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వేద పఠనానికి వచ్చిన పండితులకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రంతోపాటు నూతన వస్త్రాలు ఇచ్చి ఘనస్వస్తి నిర్వహించారని స్థానాచార్యులు పూర్ణానంద వివరించారు.