తిరుమల: తిరుమలలో (Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన ఇవాళ ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీ శ్రీనివాసవర్మ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ ఎన్ చక్రవర్తి, టీటీడీ ఈవో జె.శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, జేఈవోలు శ్రీమతి గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్వ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.