తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు శ్రీరంగం నుంచి వచ్చే పట్టు వస్త్రాలను శ్రీవారికి సమర్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వామివారికి పుష్పపల్లకీ సేవను మాడవీధుల్లో నిర్వహిస్తారు. దీనికోసం గురువారం రాత్రి పుష్పపల్లకీని సిద్ధం చేశారు. ఏటా ఆణివార ఆస్థానం రోజున స్వామివారికి ఆదాయ వ్యయాల నివేదన చేస్తారు.
పూర్వం మహంతులు శ్రీవారి దేవస్థాన పాలనా బాధ్యతలు స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి ఆలయ ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమైయ్యేవి. అయితే టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను ఏప్రిల్-మే నెలలకు మార్చారు. అయినా శ్రీవారి ఆలయంలో ఈ వార్షిక సాలకట్ల ఉత్సవం నిరంతరాయంగా సౌరమానాన్ని అనుసరించి జరగడం విశేషం.