శ్రీశైలం : సహస్ర దీపాలంకరణ సేవ సోమవారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో కనుల పండువలా సాగింది. ఆలయ ప్రాకారంలోని పురాతన దీపాలంకరణ మండపంలో ప్రదోషకాల సమయంలో స్వామి అమ్మవార్లను మండపంలోకి వేంచేపు చేసి, ఆ తర్వాత అర్చకులు షోడషోపచార పూజాది క్రతువులు జరిపారు. అనంతరం వేదమంత్రాలతో 1,008 దీపాలను వెలిగించి దీప నివేదన చేశారు.
ఆ తర్వాత భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారల ఉత్సవమూర్తులను వెండి రథంపై ప్రతిష్టించి.. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లు అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా.. ఆలయ దక్షిణ మాడవీధిలో నిర్వహిస్తున్న కళారాధన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన స్పందన లభిస్తున్నది. విశాఖపట్నానికి చెందిన కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు చూపరులను కట్టిపడేశాయి.