తిరుమల : శ్రీవారి భక్తులకు దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది.
అదేవిధంగా, శ్రీవారి పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 9, 10వ తేదీల్లో వయోవృద్ధులు, దివ్యాంగులకు దర్శనాన్ని టీటీడీ నిలుపుదల చేసింది. ఈ విషయాన్ని గమనించి వయోవృద్ధులు, దివ్యాంగులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఆగస్టు 10 వ తేదీ వరకు భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున ఈ రోజుల్లో తిరుమలకు రాకుండా మరో రోజున వచ్చేట్లుగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువైంది. శ్రీవారి దర్శనానికి దాదాపు 8 గంటలు పట్టే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెప్పారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.