సప్తాశ్వ రథ మారూఢమ్,
ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మ ధరం దేవం,
తం సూర్యం ప్రణమామ్యహమ్
Ratha Saptami | ‘ఏడు గుర్రాలను అధిరోహించిన వాడు, అదితి-కశ్యపుల పుత్రుడు, తెల్లని పద్మాన్ని చేతిలో ధరించిన వాడు అయిన సూర్యభగవానుడికి మనసారా నమస్కారం చేస్తున్నాను’ అని పై శ్లోకానికి అర్థం. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు జన్మించిన మాఘ శుద్ధ సప్తమిని రథ సప్తమిగా చేసుకోవడం సంప్రదాయం. సకల ప్రాణులకూ ఆరోగ్యాన్నిచ్చే దైవం ఆదిత్యుడు. మయూరుడనే సంస్కృత కవి కుష్ఠురోగ పీడితుడై సూర్యుడిని ఆరాధించి, సూర్య శతకాన్ని రచించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడని కథనం. రామ, రావణ యుద్ధ సమయంలో అగస్త్యుడు రఘురాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. ఆదిత్యుణ్ని ఆరాధించిన తర్వాత శ్రీరాముడు సర్వ శక్తి సమన్వితుడై రావణాసురుణ్ని సంహరించాడు. ఆరోగ్యవృద్ధికి, ఐశ్వర్య ప్రాప్తికి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలని పెద్దలు సూచించారు. సూర్యోపాసనతో సత్రాజిత్తు రోజుకు ఏడు బారువుల బంగారాన్నిచ్చే శమంతకమణి పొందాడని పురాణ కథనం.
సూర్యుడు ఆవిర్భవించిన రథ సప్తమి విశేషమైన పండుగ. ఆనాడు త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని నమ్మకం. సూర్యోపాసన చేయదలచిన వాళ్లు.. షష్ఠి నాడు ఒకేపూట భోజనం చేయాలి. సప్తమి నాడు అరుణోదయానే ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రాగి ఆకులను తల, హృదయం, భుజాలు, మెడ మీద ఉంచుకొని స్నానం చేస్తే మంచిదని పెద్దలు సూచించారు. సూర్యకిరణాల్లోని నిరోధకతను జిల్లేడు ఆకులు ఆకర్షిస్తాయి.
ఆ శక్తిని శిరస్సులోని బ్రహ్మ రంధ్రం ద్వారా శరీరంలోకి ప్రసరింపజేసి నాడులను చైతన్యవంతం చేస్తాయని నమ్మకం. సూర్యారాధనలో భాగంగా చిక్కుడు కాయలతో రథం చేసి, అందులో సూర్యుణ్ని ఆవాహనం చేసి షోడశ ఉపచారాలలో పూజించాలి. పాయసం, పొంగలి చేసి నివేదనగా సమర్పించాలి. పాయసాన్ని చిక్కుడు ఆకుల్లో ఉంచి నివేదించడం ఆచారం. ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఆ పత్రంలోని ఔషధ గుణాలు మనకు మేలు చేస్తాయని పెద్దలు ఈ సూచన చేశారు. రథ సప్తమి సందర్భంగా.. సూర్యుడితోపాటు సౌరమండలం అంతర్గతంగా ఉన్న దేవతలకు, పితృదేవతలకు అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల వారి అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది.
– డా॥ వెలుదండ సత్యనారాయణ