సీతారాములు లక్ష్మణ సమేతంగా వనవాసానికి పయనమయ్యారు. మార్గం మధ్యలో అగస్త్య మహాముని ఆశ్రమాన్ని సందర్శించారు. మహర్షిని వనవాస కాలంలో తమ ఆవాసానికి అనువైన చోటును సూచించమన్నారు. అప్పుడు అగస్త్యుడు గోదావరి తీరంలో ఉన్న ‘పంచవటి’ ప్రాంతం ప్రశస్తంగా ఉంటుందని చెప్పాడు. వన సంపదకు, జల సంపదకు లోటు లేని ఆ చోటులో వనవాసం సాఫీగా సాగిపోతుందని పేర్కొన్నాడు. అలా రామచంద్రుడి వనవాసం ‘పంచవటి’ క్షేత్రంలో ఆరంభమైంది!
పంచవటి అంటే అయిదు రకాలైన దివ్యవృక్షాల సముదాయం. సాధారణంగా రుషులు, మునులు తమ ఆశ్రమాల్లో, పర్ణశాలల చుట్టూ ఈ దేవతా వృక్షాలను పెంచేవారు. వనవాస కాలంలో శ్రీరాముడు దర్శించిన భరద్వాజ, అగస్త్య మహర్షుల ఆశ్రమాలు పంచవటి పర్ణశాలలుగా ఉన్నట్లు రామాయణ ఇతిహాసాన్ని బట్టి తెలుస్తున్నది. ఈ దేవతా వృక్షాలు కర్బన వాయువులను స్వీకరించి, ప్రాణవాయువును విడుదల చేస్తుంటాయి. అంతేకాకుండా ఆయుర్వేద, పురాణ గ్రంథాల్లో ఈ వృక్షాల మాహాత్మ్యాన్ని విస్తారంగా వర్ణించడం కనిపిస్తుంది.
వట వృక్షం(మర్రి చెట్టు), అశ్వత్థం (రావిచెట్టు), నింబ (వేప చెట్టు), అమలక (ఉసిరిచెట్టు), బిల్వ (మారేడు చెట్టు) వృక్షాలతో కూడిన పంచవటి పారమార్థిక సాధనలకు ఎంతో విశిష్టమైనదని ఎందరో ఆధ్యాత్మికవేత్తలు నిరూపించారు. గౌతమబుద్ధుడు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, రామకృష్ణ పరమహంస, సాయిబాబా వంటి ఎందరో జిజ్ఞాసువులు ఈ పంచవటి వృక్షాల చెంతనే తమ తపోసాధనలు నిర్వర్తించారు.
పరమహంస పయనంలో…
రామకృష్ణ పరమహంస తాను అర్చకత్వం నిర్వహించిన దక్షిణేశ్వర కాళీదేవి ఆలయ సమీపంలోనే పంచవటిని ఏర్పాటు చేసుకున్నారు. మర్రి, అశ్వత్థ, నింబ, అమలక, బిల్వ మొక్కలను స్వయంగా ఆయనే నాటారు. అంతేకాదు బృందావనం వెళ్లినప్పుడు అక్కడినుంచి తెచ్చిన మట్టిని ఈ పంచవటిలో చల్లారు. ఇక్కడే చిన్నకుటీరం నిర్మింపచేసుకొని ధ్యానం చేసేవారు. వారి ఆధ్యాత్మిక సాధనలకు ఈ నెలవే వేదికగా నిలిచింది. ‘పంచవటి’ ధ్యానానికి, జపానికి, తపానికి అనువైన చోటు అని ఆయన నిరూపించారు. ఆయన తమ గురువులు తోతాపురి, భైరవి బ్రాహ్మణి వంటి వారి సమక్షంలో ఆధ్యాత్మిక, తాంత్రిక సాధనలు చేసింది కూడా ఈ పంచవటిలోనే! ఈ అయిదు వృక్షాల ప్రత్యేకతలు…
వటవృక్షం
ప్రార్థనలు చేయటం అనాది కాలం నుంచి వస్తున్నది. దీనిని విష్ణుమూర్తి అంశగా భావిస్తారు. స్వామికి వటపత్రశాయి అని పేరు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు గీతను బోధించింది కూడా వటవృక్షం సమీపంలోనే! కురుక్షేత్రంలో దాదాపు అయిదువేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ వృక్షరాజం నేటికీ దర్శనమివ్వడం విశేషం.
బిల్వవృక్షం
బిల్వ పత్రాలతో శివుణ్ని పూజిస్తారు. ఇది సాక్షాత్తూ శివ స్వరూపమని భావిస్తారు. ఒకానొక సమయంలో శని ప్రభావం నుంచి తప్పించుకునేందుకు సాక్షాత్తూ ఆ మహాదేవుడే మారేడు చెట్టుగా మారి అజ్ఞాతంగా ఉన్నాడని పురాణ కథనం. అందుకే బిల్వ పత్రాలతో శివుణ్ని పూజించిన వారిపై శని ప్రభావం ఉండదని భక్తుల విశ్వాసం. నేటికీ బిల్వ దళాలతో లింగార్చన చేస్తుంటారు.
అశ్వత్థ వృక్షం
పలు దేవతామూర్తులు అశ్వత్థ వృక్షం నీడలోనే ఆరాధనలు అందుకుంటాయి. బుద్ధుడికి జ్ఞానోదయం అయింది కూడా ఈ చెట్టు కిందే! అందుకే దీనిని బోధివృక్షం అని కూడా పిలుస్తారు. బౌద్ధ భిక్షువులకు ఇది అత్యంత పవిత్రమైంది. తొలిరోజుల్లో గౌతమబుద్ధుడి పాదముద్రలు, చిహ్నాలను, పాదుకలను ఆయన స్మృతులుగా ఈ రావిచెట్టు కింద ఉంచి ధ్యానించేవారు. పల్లె ప్రాంతాల్లో గ్రామదేవతలు రావిచెట్టు మూలాల్లోనే కొలువుతీరి ఉండటం గమనించవచ్చు. తమిళనాడులోని తిరుకచ్చూర్ ఆలయంలోని నరసింహమూర్తి ఈ వృక్షఛాయలోనే వెలిశాడని చెబుతారు. అందుకే అశ్వత్థ వృక్షాన్ని ‘స్థలవృక్షం’గా భక్తులు ఆరాధిస్తారు.
నింబ వృక్షం
శిరిడీ సాయిబాబా జీవితంలో వేపచెట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది. శిరిడీలో ఓ వృద్ధ భక్తురాలికి పదహారేండ్ల బాబా మొదటిసారి దర్శనమిచ్చింది ఈ నింబవృక్షం కిందే! బాబా అంశగా భావించే అక్కల్కోట్ మహారాజు పాదుకలను శిరిడీలోని ఈ వేపచెట్టు కిందే ఆయన భక్తుడు ప్రతిష్ఠించారు. వేప దుష్టశక్తులను పోగొడుతుందని విశ్వాసం. ప్రమాదకర వైరస్లను అడ్డుకుంటుందని శాస్త్రీయ ప్రమాణాలూ ఉన్నాయి. పల్లెల్లో గ్రామ దేవతల పూజల్లో వేప ప్రాధాన్యాన్ని గమనించవచ్చు. బోనాల సమయంలోనూ వేప కొమ్మలు ఇంటింటికీ తోరణాలుగా కట్టడం వెనుక కూడా వానకాలంలో బ్యాక్టీరియా విజృంభించకుండా అడ్డుకోవాలనే ఉద్దేశం కనిపిస్తుంది.
అమలక వృక్షం
నదీ స్నానం, నదీ పూజలో, దీపారాధనలో ఉసిరిది ప్రత్యేక స్థానం. ఉసిరిచెట్టు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైంది. అందుకే కార్తిక మాసంలో వనభోజనాలు ఉసిరి చెట్టు నీడన చేసే సంప్రదాయం ఏర్పడింది. వనభోజనాల ప్రారంభానికి ముందు, ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజిస్తారు. ఉసిరి ఆరోగ్య ప్రదాయని కూడా! ఉసిరి ఉత్పత్తులు ఆయుర్వేదంలో విశేషంగా
కనిపిస్తాయి.
పంచవటిలో అమలక వృక్షానికి బదులుగా కొందరు అశోక వృక్షాన్ని కూడా నాటుతారు. రామాయణంలో సుందరకాండకు ఎంత ప్రాధాన్యం ఉందో, సీతాదేవి లంకలో బందీగా ఉన్నప్పుడు ఆమె ఆవేదనకు సాక్ష్యంగా ఉన్న అశోకవనానికీ అంతే ప్రాశస్త్యం కనిపిస్తుంది. అందుకే అశోక వృక్షాన్ని పంచవటిలో భాగంగా పెంచేవాళ్లూ కనిపిస్తారు. మొత్తంగా చూస్తే ఈ అయిదు వృక్షాలు ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగానూ ప్రయోజనకరం. అందుకే పారమార్థిక సాధనకు పంచవటిని అత్యున్నత ప్రదేశంగా ఆధ్యాత్మికవేత్తలు భావిస్తారు!
…?మనోజ్ఞ