తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండు రోజు సోమవారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. స్వర్ణరథంపై అమ్మవారిని దర్శిస్తే తలచిన పనులు నెరవేరడంతో పాటు, మరో జన్మ ఉండదని అర్చకులు తెలిపారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా స్వర్ణరథం మంటపానికి తీసుకొచ్చారు. ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకు స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది.
బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం శుక్రవారపు తోటలో శుక్రవారపు తోటలో స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ దామోదరం పాల్గొన్నారు.