TTD news | తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైభవంగా సాగుతున్నది. ఉత్తర ద్వారం దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో స్వర్ణరథాన్ని ఊరేగించారు. స్వర్ణ రథంపై ఊరేగిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు పలుకుతూ తన్మయత్వం పొందారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వర్ణ రథంపై విహరిస్తున్న శ్రీ మలయప్పస్వామిని దర్శించుకుంటే మనసులోని కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
భక్తులు ముఖ్యంగా మహిళలు బంగారు రథాన్ని లాగారు. టీటీడీ మహిళా ఉద్యోగులు రథం లాగడంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ స్వర్ణ రథాన్ని మాడ వీధుల్లో తిప్పారు. బంగారు రథంపై శ్రీవారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంతో గోవిందా.. గోవిందా అంటూ హరినామ స్మరణం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు శ్రీమతి మల్లీశ్వరి, మధుసూదన్ యాదవ్, సీవీఎస్ఓ నరసింహ కిషోర్, సీఈ నాగేశ్వరరావుతోపాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సోమవారం అర్ధరాత్రి నుంచి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున శ్రీవారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో తిరుమల కొండపైకి వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. ఉత్తర ద్వారం దర్శనం ఈ నెల 11 వరకు కొనసాగనున్నది.