హిందువుల పండుగలన్నీ ప్రకృతి చైతన్యంతో పరమాత్మ నిరూపణతో ముడిపడి ఉన్నవే. శిశిర రుతువు, మాఘమాసంలో వచ్చే పర్వదినాల్లో శ్రేష్ఠమైనది వసంత పంచమి. శిశిరం ఆకురాలే కాలం. అంటే పండిన ఆకుల్ని (పాతదనాన్ని) రాల్చుకొని లేలేత చిగురాకులతో రానున్న వసంతానికి స్వాగతం పలకమని ఈ పర్వం ప్రబోధిస్తుంది. వసంత పంచమి, రథసప్తమి, వసంత పౌర్ణమి పర్వాలన్నీ మాఘ మాసంలోనే వస్తాయి. రుతువుల రాణి వసంతానికిది ముందస్తు ఆహ్వానం అన్నమాట.
వసంత పంచమికే శ్రీ పంచమి అని మరోపేరు. ‘శ్రీ’ అంటే లక్ష్మి, సంపద, శుభం వంటి అనేక అర్థాలున్నాయి. సంపదలలోకెల్లా శ్రేష్ఠమైన సంపద జ్ఞానమే కదా! అందుకే జ్ఞాన ప్రదాయిని సరస్వతీ దేవి జన్మదినంగా ఈ పంచమిని జరుపుకొంటాం. సరస్వతి అంటే అంతర్వాహిని. గంగా యమునా నదులతోపాటుగా త్రివేణీ సంగమంలో సరస్వతీ నది అంతర్వాహిని. ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా ఉండే జ్ఞానవాహిని కూడా సరస్వతీ దేవే. ఆమెను చదువుల తల్లిగా అందుకే కొలుస్తాం.
తెల్లని రూపం స్వచ్ఛతకు నిదర్శనం. అజ్ఞానం చీకటైతే విజ్ఞానమే వెలుగు. చీకటిలో నుంచి వెలుగులోకి ప్రయాణించమనే భావనకు సంకేతంగా చీకటి రాత్రి నిడివి క్రమంగా తగ్గుతూ వెలుగుల పగటికాలం పెరుగుతున్న కాలంలోని మార్పులకు ప్రతీక ఈ వసంత పంచమి. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులతో అనుగ్రహించే సరస్వతి ప్రాధాన్యం శ్రుతి, స్మృతులలో, మంత్రశాస్త్రంలో పుష్కలంగా ఉంది. రుగ్వేదం సరస్వతీ సూక్తాలను బహుళంగా అందించింది. మంత్ర శాస్త్రం శుక్ల సరస్వతి, నీల సరస్వతి, వాగ్వాదిని, నకులీ సరస్వతి వంటి అనేక శారదా మూర్తులను అందించింది.
‘ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీ వతీ’ అనీ, ‘అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం’ అని వేదం ఆ ఆద్యాశక్తిని కీర్తించింది. పుట్టుకలేని, ఏక స్వరూపిణి- రజోగుణ, సత్త్వగుణ, తమో గుణాలను నియమిస్తూ మూడు వర్ణాల రూపంతో కనిపిస్తుంది. అమ్మ రూపాలలో ఏ రూపాన్ని ప్రీతిగా ఆరాధిస్తే, ఆ రూపమే అన్ని రూపాలకూ మూలరూపంగా భాసిస్తుంది. సరస్వతిని సర్వశుక్లా రూపిణిగా ఆరాధిస్తాం. షోడశ కళాస్వరూపిణి అయిన సరస్వతిని బమ్మెర పోతన మహాకవి పదహారు తెల్లని సుకుమార వస్తువులతో వర్ణించి అర్చించి తరించాడు. ఈ స్తుతితో మనకూ సరస్వతీ సాక్షాత్కరం కలిగించాడు.
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ! (భాగవతం)
సరస్వతీ మాత తెలుపురంగులో ధగద్ధగాయమానంగా వెలుగులీనుతుందిలా. శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల తెల్లదనం, చంద్రుని వెన్నెల, పచ్చకర్పూరం, తెల్లని పటీరమూ (చందనం), రాజహంస, జాజిచెండ్లూ, నీహారాలూ (మంచు తుంపరలు), డిండీరం (నురుగు), వెండికొండా, రెల్లుపూలూ, ఆదిశేషుడు, మల్లెలూ, మందారాలూ, పాలసముద్రం, పుండరీకాలూ (తెల్ల తామరపూలు), అన్నింటికీ మించి ఆకాశగంగా ప్రవాహం ఇలా తెల్లగా, తేలికైన వస్తువులతో పోతన మహాశయుడు వాగ్దేవిని అభివర్ణించాడు.
పుస్తకాలు జ్ఞాన భాండాగారాలు. సరస్వతీదేవి స్వరూపాలు. కాబట్టి శ్రీ పంచమి సందర్భంగా ఈ రోజు పుస్తకపూజ రూపంలో సరస్వతిని అర్చిస్తారు. బాలబాలికలకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. అలా ఈ పండుగనాడు అమ్మవారిని అర్చించి జ్ఞానవైభవాన్ని పొందుతారు.