TTD news | తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి తర్వాత ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అమ్మవార్లు, అయ్యవార్లు పూలచెండ్లతో కలహించుకోవడం ఆకట్టుకున్నది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీ మలయప్పస్వామి పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగార్లు పూలచెండ్లతో స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆస్థానం నిర్వహించారు. ఈ ఉత్సవంలో శ్రీ నమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నింధాస్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేయడం ప్రత్యేకత. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్ స్వామితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
అంబులెన్స్ను విరాళంగా ఇచ్చిన ఎస్బీఐ
రూ.25 లక్షల విలువైన అంబులెన్స్ను టీటీడీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విరాళంగా అందజేసింది. ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట అంబులెన్స్కు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం బ్యాంకు ఛైర్మన్ దినేష్ కుమార్ ఖార అంబులెన్స్ తాళాలను టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. స్విమ్స్ లో ఈ అంబులెన్స్ను వినియోగించనున్నారు.