శుకముని అవనీపతి పరీక్షిత్తుతో… నరవరా! స్మరహరుడు గిరిజా వరుడు తన కరతలం (అరచేతి)లోని గరళాన్ని బిరబిరా ఆరగిస్తుండగా ఆయన అరచేతి నుంచి చెదిరి కిందికి చిందిపడిన కొన్ని విష బిందువులను వృశ్చికాలు, సర్పాది ఇతర సరీసృపాలు, మరికొన్ని విషపూరిత వనస్పతులు గ్రహించాయి. ఇది లోకానికి ఉపకారమే అయింది. ‘విషస్య విషమౌషధం’- కొన్ని రోగాలకు విషమే పరమౌషధం కదా! మూల గ్రంథంలోని ఈ విషయాన్ని పోతన తన అమూలకమైన ‘ఫలశ్రుతి’లో పరోక్షంగా స్ఫురింపజేశాడు.
సాగర మథనం మరింత వేగిరంగా సాగుతోంది. జాగులేక కడలి నుంచి మొదటగా వెడలి వచ్చిన తెల్లని మేను కలిగిన కామధేనువును వశిష్ఠ వామదేవాది విశిష్ట మహర్షులు ‘బాగు-బాగు’ అంటూ తమ యాగ క్రియలలో హోమద్రవ్యాలకై గ్రహించారు. అటు తర్వాత పటుతరమైన ‘ఉచ్చైశ్శ్రవం’ (గొప్పకీర్తి కలది) అనే అశ్వం పుట్టింది. ‘అనుకూలః శతావర్తః’- అనుకూలుడైన అంతర్యామి- అచ్యుతుని (ఈ గుర్రం కన్నా తరువాత వచ్చే గజం ఎంతో మిన్న అన్న) ప్రేరణచే ఆఖండలుడు- ఇంద్రుడు అశ్వాన్ని ఆశించలేదు. అసుర నాయకుడు బలి దాన్ని వీక్షించి అపేక్షించాడు. కీర్తి దొడ్డది కానీ, కీర్తిదాహం బహుచెడ్డది. గౌరవం భైరవమైన రౌరవ నరక సమానమని నీతి శాస్త్రం. దానికై ఆశపడువారు అమృత ప్రాశనం- పానం చేయజాలరని అంతరార్థం! ఆపై నాలుగు దంతాలు కలిగిన ‘ఐరావత’మనే గజేంద్రం పుట్టింది. పూబంతుల వంటి ఇంతుల కులుకు నడకలకు ఒజ్జబంతి అనదగిన దేవదంతిని- గజేంద్రాన్ని దేవదేవుడి దయతో దేవేంద్రుడు పొందగలిగాడు. అణువు కన్నా అత్యంత సూక్షుడైన అంతర్యామిని- స్వామిని అంతరంలో దర్శించడానికి ఎంతో సూక్ష్మదృష్టి అవసరం. దంతావళం (ఏనుగు) దానికి సంకేతం.
సూక్ష్మదృష్టి కలవారే కదా సృష్టిలో సుధాపానానికి సదా సమర్థులు! తరువాత ఆవిర్భవించిన, అన్ని రుతువులలో తరుగని పరువాలతో అలరారే కల్పతరువు సంక్రందను (ఇంద్రు)ని నందన వనానికి తొడవుగా (అలంకారంగా) తరలిపోయింది. పిమ్మట ఉద్భవించిన ‘కౌస్తుభం’ అనే పద్మరాగమణి నేరుగా పద్మనాభుని కంఠాన్ని అలంకరించింది. ఆపై అప్సరసలు ఆవిర్భవించి స్వర్గవాసులకు భోగకాంతలుగా వాసికెక్కారు. ఆ వెంట సుధాకరుడు- చంద్రుడు ఉద్భవించి విధాత-బ్రహ్మ అనుమతితో తన యథా (తొల్లింటి) స్థానాన్ని అధిష్ఠించాడు. వెనువెంటనే అందచందాలకు పెన్నిధి, చందురు తోబుట్టువు, ముకుందుని పట్టపుదేవి, మురహరుని ముద్దుమురిపాల బాల, ఇందువదన ఇందిర తొలుకారు (కొంగొత్త) మెరుపు తీగవంటి మేనుతో కడలి నుంచి వెలువడి కనువిందు కావించింది. సురబృందం నడుమ నిలిచి సందడి చేసింది. విమలమతి పోతన కమలామాత అమల సౌందర్యాన్ని మూలానికి కూడా వన్నె తెచ్చే లాగున వర్ణించి, లోక శోక వినాశిని, జగజ్జనని, అతిలోక ‘త్రైలోక్య కుటుంబిని’ పారమార్థిక తత్త్వాన్ని అలోక సామాన్యమైన తన భావనా నేత్రంతో దర్శించి అమూలకమైన సీస పద్యంతో విలోకనీయంగా వాసికెక్కించాడు…
‘భార్గవి తన నిండు మనస్సులో ఒకసారి బ్రహ్మాండాన్నంతా తన బొమ్మరిల్లుగా భావించేది. మరోసారి, చతుర్దశ భువనాలన్నింటినీ తన భవనం- శ్రీరంగ ధామంలోని కుండల దొంతులు- వరుసలుగా ఊహించేది. ఆ ముకుందప్రియ బ్రహ్మ ఇంద్రాది దేవతలను తన ఇంటిలోని ఆటబొమ్మలుగా ఒకసారి తలచేది. ఇంకోసారి, భూ మండలాన్నే తన బొమ్మల కొలువుగా భావించేది. మరోమారు దినకర (సూర్య) సుధాకరు (చంద్రు)ల ప్రచండ, శీతల ప్రభలను చిరుదీపాలుగా చిత్తగించేది. ఆ అన్నులమిన్న ఒకమాటు శారద శర్వాణులను తన అనుంగు సఖులు- చెలికత్తెలుగా కలిమి చెలిములతో ఆదరించేది.’
శ్రీదేవి దర్శనంతో శ్రీమన్నారాయణుడు తప్ప తక్కిన దేవ, దానవ, మానవులంతా ధైర్యం- మనోైస్థెర్యం కోల్పోయారు. ఇందీవరలోచన వారందరినీ చూసి, తొందరపడక ‘ఇందరిలో కడు వందనీయుడు- వరింపదగిన వాడెవడు?’ అని ఆలోచించింది. ప్రతివానిలో స్వరూపంలోనో, స్వభావంలోనో ఏదో ఒక అపశృతి! దుర్వాసాది మునులు తపోధనులే. కానీ, క్రోధనులు! దేవ గురువు బృహస్పతి, దైత్య గురువు శుక్రుడు ప్రజ్ఞావంతులే కాని, వారిలో ఏ ఎండకాగొడుగు పట్టే ప్రపంచాసక్తి మెండు. ఇంద్రుడు స్వర్గానికి ప్రభువైనా అతని ప్రాభవం- ఐశ్వర్యం పరాశ్రయం కోరేదే కాని స్వతంత్రం కాదు. చిరంజీవి పరశురామునిలో ధర్మం ఉంది కాని, దయ లేదు. ఇక సనకాదులు కామినీ కనకాలయందు కాంక్షే లేనివారు. శిబి మొదలైనవారి యందు త్యాగమున్నా అది ‘నివృత్తి’ లేనందున మోక్షయోగ కారణం కాదు. కార్తవీర్యుడు ఎంత బలశాలి అయినా పరశురాముడి చేతిలో ఓటమిపాలై కాలానికి లొంగినవాడు. మహాదేవుడు మంగళకరుడైనా.. శ్మశానవాసం, కపాల మాల, చితాభస్మ ధారణం వంటి అసాధారణ అమంగళాలు ఉన్న దిగంబరుడు హరుడు తనకు వరుడు కాజాలడు. మార్కండేయుడు దీర్ఘాయువైనా దాంతుడు కాన కాంతుడు (భర్త)గా పనికిరాడు. దినకరుడు తమోహరుడైనా అత్యంత తాపకరుడు. వాయువు చిరాయువు- కడలేనివాడే కాని చంచలుడు, నిలకడలేని వాడు. చెలికాడుగా పనికిరాడు. ఇలా శ్రీదేవి అక్కడి గొప్పవారందరి నడవడికలను వడివడిగా విశ్లేషించి వారి సంగతి విడనాడింది. ‘వీరందరూ నన్ను కోరేవారే. అట్టి వారందరినీ నేను పరిహరిస్తా. నన్ను కోరనివానినే నేను వరిస్తా’ అని మదిలో సంకల్పించింది మాధవి.
సీ॥ భావించి యొకమాటు బ్రహ్మాండమంతయు
నాటల బొమ్మరిల్లని తలంచుఁ
బోలించి యొకమాటు భువనంబు లన్నియుఁ
దనయింటిలో దొంతులని తలంచు
బాటించి యొకమాటు బ్రహ్మాది సురలను
దనయింటిలో బొమ్మలని తలంచుఁ
గొనకొని యొకమాటు కుంభినీచక్రంబు
నలవడ బొమ్మపీఁటని తలంచు’
ఆ॥ ‘సొలసి యొక్కమాటు సూర్యేందురోచుల
నచటి దీపకళికలని తలంచు
భామ యొక్కమాటు భారతీదుర్గల
నాత్మసఖులటంచు నాదరించు’
ఏ దోషం, ఎట్టి దౌర్బల్యం లేనట్టి సర్వగుణ భూషితుడు, పూర్ణ పురుషుడు, క్షీరార్ణవ నికేతనుడు, పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు మాత్రమే ఆత్మారాముడై నన్ను కోరడం లేదని నిశ్చయించింది. ఆయన అచ్యుతుడు. అతనిని ఆశ్రయిస్తే తన మాంగళ్యానికి చ్యుతి ఉండదు. ఆయనను పతిగా పొందితే సవతిపోరు లేక నిత్య సౌభాగ్యవతిగా ఉండవచ్చు..
ఆ॥ ‘సాధు రక్షకుండు షడ్వర్గ రహితుండు
నాథుఁడయ్యెనేని నడవ నోపు
నితఁడే భర్తయనుచు నింతి సరోజాక్షుఁ
బుష్పదామకమునఁ బూజసేసె’
సజ్జన పరిరక్షకుడు, కామక్రోధాది అరిషడ్వర్గ రహితుడు అయిన హరి మాత్రమే నాకు సరైన భర్త అని సంభావించి సిరి- ఇందిర, ఇందీవర (కలువ పూల) వరమాలతో సంసారసాగర మథన మందరుని- ముకుందుని అలంకరించి ఆయన విశాల వక్షస్థలాన్ని తన నిత్య నివాస మందిరంగా వరించింది!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006